- గ్లోబల్ మున్నూరు కాపు మహాసభ గోడ ప్రతుల ఆవిష్కరణ
- తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య
నస్పూర్, ఆర్.కె న్యూస్: తెలంగాణలో అత్యధిక సంఖ్యలో ఉన్న మున్నూరు కాపులు ఒకే కులం ఒకే సంఘంగా బలోపేతం అవుదామని తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ బోరిగం రాజారాంలు అన్నారు. గురువారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ, తెలంగాణ వ్యాప్తంగా గ్రామ, మున్సిపాలిటీ, కార్పొరేషన్, జిల్లా స్థాయిలో 12 వేల కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సంఘంలో సభ్యులుగా ఉన్న వారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ ప్రక్రియ ద్వారా కమిటీలను ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. బీసీల్లో అత్యధిక సంఖ్యలో ఉన్న మున్నూరు కాపులను ప్రభుత్వం తక్కువగా చూపించిందని, బీసీల్లో 18 శాతంగా మొదటి స్థానంలో ఉన్న తమను 5వ స్థానంలో చూపారని ఆరోపించారు. తెలంగాణలో 40 లక్షల మంది మున్నూరు కాపులు ఉన్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కుల గణన నిర్ణయం తీసుకోవడం హర్షనీయమన్నారు. మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి 500 కోట్లు కేటాయించాలని, ప్రోత్సాహక రుణాలు ఇవ్వాలని, మున్నూరు కాపు ఆత్మగౌరవ భవనం నిర్మాణానికి 10 కోట్లు కేటాయించాలని, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మున్నూరు కాపులకు చోటు కల్పించాలని పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన తమకు వాటా అన్ని రంగాల్లో కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మున్నూరు కాపులకు పటేల్ గా గెజిట్ విడుదల చేయాలన్నారు. అనంతరం అమెరికాలో ఆగస్టు 30, 31 తేదీల్లో జరగనున్న గ్లోబల్ మున్నూరు కాపు సభ గోడ ప్రతులను ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపులు ఈ మహా సభలో కలుసుకోనున్నారని, ప్రతి ఒక్కరు కుల సంఘంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ సమావేశంలో మున్నూరు కాపు సంఘం మంచిర్యాల నియోజకవర్గం అధ్యక్షుడు పల్లె భూమేష్, జిల్లా గౌరవ అధ్యక్షుడు గొంగల్ల శంకర్, కన్వీనర్ ఆకుల సత్తన్న, జిల్లా అధికార ప్రతినిధి భాస్కర్ల రాజేశం, నస్పూర్ మండల సమన్వయ కమిటీ సభ్యులు మైదం రామకృష్ణ, గుడాల మల్లేష్, రాళ్ళబండి రాజన్న, పూదరి కుమార్, చెన్నూర్ నియోజకవర్గం ఇంచార్జి బోరిగం వెంకటేశం, నాయకులు బొడ్డు చిన్నయ్య, సమ్మయ్య, విశాల్, కర్నె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.