సొన్, ఆర్.కె న్యూస్: మద్యం సేవించి వాహనం నడిపిన లారీ డ్రైవర్ కు 20 రోజులు జైలు శిక్ష పడిందని ఎస్సై గోపి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని గంజాల్ టోల్ ప్లాజా వద్ద ఈనెల 6వ తేదీన వాహనాలను తనిఖీ చేస్తుండగా అదిలాబాద్ వైపు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఒక లారీ డ్రైవర్ మద్యం సేవించి వాహనము నడుపుతూ పట్టుబడినాడు. అతనిని మంగళవారం నిర్మల్ కోర్ట్ నందు హాజరు పరచగా మెజిస్ట్రేట్ అతనికి 20 రోజులు జైలు శిక్ష విధించడం జరిగిందని, ప్రతి వాహనదారుడు మద్యం సేవించి వాహనాలను నడపరాదని, రూల్స్ ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎస్సై తెలిపారు.
KYATHAM RAJESH
సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో పార్ట్ టైం జూనియర్ లెక్చరర్ల పోస్టుల డెమోలు వాయిదా
సొన్, ఆర్.కె న్యూస్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలలో ఈ నెల 10 న జరుపబడే పార్ట్ టైం జూనియర్ లెక్చరర్స్, పిజిటి, టీజీటీల, ఇతర పోస్టుల డెమోలను గురుకులాల సెక్రెటరీ హైదరాబాద్ వారి ఆదేశానుసారం వాయిదా వేయబడినది. సంస్థ ద్వారా నిర్ణయించబడిన తేదీని తదుపరి ప్రకటించబడునని నిర్మల్ జిల్లా డిసిఓ R . ప్రశాంతి ఒక ప్రకటనలో తెలిపారు.
సొన్, ఆర్.కె న్యూస్: మండలంలోని కడ్తాల్ గ్రామపంచాయతీలో భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల భర్తీ ప్రక్రియను తహసీల్దార్ సంతోష్, గ్రామ సర్పంచ్ గుర్రం రాము మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2002 ఓటరు జాబితాలో పేరు ఉన్నవారు అప్పట్లో నమోదైన పేరు, తల్లిదండ్రుల లేదా భర్త పేరు, చిరునామా, కుటుంబ వివరాలు, ఓటరు నమోదు సంఖ్య తదితర వివరాలను పరిశీలించి, వాటికి అనుగుణంగా ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి చేయాలని సూచించారు. అలాగే ప్రతి అర్హుడు ఫారాన్ని సక్రమంగా నింపి ఎన్నికల సిబ్బందికి అందజేసి, ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి సుమయా తస్కిన్, జీపీఓ గంగాధర్, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక.. సంఘం అభివృద్ధికి పాటుపడతామన్న అధ్యక్షుడు
నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ మండల పెరిక సంఘం నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా అంబడి కుమారస్వామి ఎన్నిక కాగా, గౌరవ అధ్యక్షులుగా తిప్పని రామన్న, ప్రధాన కార్యదర్శిగా రెంక రవిలు ఎన్నికయ్యారు. అలాగే కార్యదర్శిగా ఒడ్డె వెంకటస్వామి, ఉపాధ్యక్షులుగా అల్లం సతీష్, దొమ్మటి రాజేందర్, ప్రచార కార్యదర్శిగా దొమ్మటి కిరణ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన మండల అధ్యక్షుడు అంబడి కుమారస్వామి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించిన సంఘం పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అందరినీ కలుపుకుంటూ పెరిక సంఘం బలోపేతానికి, సామాజిక అభివృద్ధికి తన వంతుగా నిరంతరం శ్రమిస్తానని పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి సంఘ సభ్యులు అభినందనలు తెలియజేశారు. ఈ ఎన్నికల కార్యక్రమంలో పెరిక సంఘం జిల్లా కమిటీ అధ్యక్షులు బొడ్డు శంకర్, నాయకులు కార్కూరి చంద్రమౌళి, మేడం తిరుపతి, చుంచు రాజ్కిరణ్, అత్తి సరోజతో పాటు సంఘం సభ్యులు పాల్గొన్నారు.
సోన్, ఆర్.కె న్యూస్: ఆయిల్ పామ్ పంట రైతులకు అత్యంత లాభదాయకమైన పంట అని మండల వ్యవసాయ అధికారి (ఎంఏవో) జి. వినోద్ కుమార్ తెలిపారు. సోన్ మండలంలోని పాకపట్ల గ్రామంలో వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) రాజ్కుమార్తో కలిసి రైతులకు ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్ పామ్ పంటలో పెట్టుబడి తక్కువగా ఉండి, దిగుబడి అధికంగా ఉంటుందని తెలిపారు. ఒకసారి మొక్కలు నాటితే సుమారు 30 సంవత్సరాల వరకు నిరంతర ఆదాయం పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగుకు వివిధ రకాల ప్రోత్సాహకాలు, సబ్సిడీలు అందిస్తున్నందున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పలువురు రైతులు ఆయిలపామ్ పంట సాగు కోసం దరఖాస్తు చేసుకున్నారు ఆయిల్ పామ్ పంటకు మార్కెటింగ్ సౌకర్యం అందుబాటులో ఉండటంతో పాటు రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని వివరించారు. నీటి వనరులు ఉన్న రైతులు ఆయిల్ పామ్ సాగు చేపట్టి ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందాలని కోరారు.ఈ కార్యక్రమం లో రైతులు లోకేష్,సుధాకర్, సృజన్ , మధుకర్ రెడ్డి పాల్గొన్నారు.
సోన్, ఆర్.కె న్యూస్: వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సోన్ మండల ఎంపీడీవో కె. రామకృష్ణ సూచించారు. శుక్రవారం మండలంలోని కడ్తాల్ గ్రామంలో ఆయన పర్యటించి పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో డ్రైనేజీలు, రహదారులు, తాగునీటి వనరులను పరిశీలించి పరిశుభ్రతకు సంబంధించిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. వర్షాకాలంలో మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని తెలిపారు. దోమల వ్యాప్తి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన కోరారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులతో ఇండ్లు నిర్మాణం త్వరగా పూర్తి చేయించాలని అన్నారు. నూతనంగా భాద్యతలు చేపట్టి మొదటిసారి గ్రామానికి వచ్చిన ఎంపీడీవోను గ్రామ సర్పంచ్ గుర్రం రాము శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుమయా తస్కిన్ పాల్గొన్నారు.
- రియాజ్ అహ్మద్, ఉదారి చంద్రమోహన్ గౌడ్
- ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్
- ఈనెల 20 లోపు మెడికల్ బోర్డు నిర్వహించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు హెచ్చరిక
నస్పూర్, ఆర్.కె న్యూస్: ప్రభుత్వ హామీ మేరకు తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భూ పోరాటం చేపట్టిన తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవితను అరెస్టు చేసిన తీరు అత్యంత అభ్యంతరకరంగా ఉందని హెచ్ఎంఎస్ జనరల్ సెక్రెటరీ రియాజ్ అహ్మద్, టిఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఉదారి చంద్రమోహన్ గౌడ్ విమర్శించారు. శుక్రవారం నస్పూర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఒక మహిళా నాయకురాలు పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని, ఈ క్రమంలో పలువురు ఉద్యమకారులకు గాయాలయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకారులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తూ తెలంగాణ ద్రోహులకు సీట్లు, పదవులు ఇస్తోందని ఆరోపించారు. ఉప్పల్లో కవిత చేపట్టిన భూ పోరాట కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు లోపాయకారీగా ఒకటయ్యాయని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, కేటీఆర్ కలిసి కల్వకుంట్ల కవితను టార్గెట్ చేశారని రియాజ్ అహ్మద్, చంద్రమోహన్ గౌడ్ ఆరోపించారు. కవిత చేపట్టిన ‘బాయిబాట’ కార్యక్రమానికి పోటీగా హరీష్ రావు సింగరేణి పర్యటనలు పెట్టుకున్నారని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సింగరేణిలో గనులు, కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గాయని, వందల కోట్ల సింగరేణి నిధులను హరీష్ రావు, కేటీఆర్ తమ సొంత నియోజకవర్గాలకు మళ్లించుకున్నారని మండిపడ్డారు. సింగరేణి కార్మికులు చేపట్టిన సకల జనుల సమ్మెతోనే తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి చేరిందని, రాష్ట్ర ఏర్పాటులో కార్మికుల పాత్ర కీలకమని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సింగరేణిలో కొత్త గనులు, ప్రాజెక్టులు ప్రారంభించి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల సంపూర్ణ మద్దతు కల్వకుంట్ల కవితకు ఉందని, భవిష్యత్తులో ఆమె రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 20వ తేదీలోపు మెడికల్ బోర్డు నిర్వహించకపోతే హెచ్ఎంఎస్, టిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.
ఎస్ఆర్పీ 3 ప్రమాదంపై నిష్పక్షపాత విచారణ జరపాలి
గురువారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పీ 3 గనిలో జరిగిన ప్రమాదం సైడ్ ఫాల్ కాదని, అది ముమ్మాటికీ రూఫ్ ఫాల్ (పైకప్పు కూలడం) ప్రమాదమేనని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. సింగరేణి యాజమాన్యం గనుల్లో జరుగుతున్న పలు ప్రమాదాల వివరాలను బయటకు రాకుండా దాస్తోందని ఆరోపించారు. ప్రమాదానికి కారణమైన అధికారులను తక్షణమే బదిలీ చేసి, నిష్పక్షపాత విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సింగరేణి సీఎండీ, డైరెక్టర్లు ఏసీ గదుల్లో కూర్చొని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలు చేయడం కాకుండా, క్షేత్రస్థాయిలోకి వచ్చి గనులను సందర్శించి కార్మికుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో హెచ్ఎంఎస్ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ వి. అనిల్ రెడ్డి, నాయకులు ఎర్రం శెట్టి సాయి కుమార్, తుల అనిల్ కుమార్, కాసర్ల అశోక్ రెడ్డి, టిఆర్ఎస్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కోరకొప్పుల మహేష్ గౌడ్, ఉపాధ్యక్షుడు రాసకొండ సురేష్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సంధ్యారాణి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు హారికరావు, ఉమ్మడి ఆదిలాబాద్ మీడియా ఇంచార్జి వేముల సాయి కుమార్ గౌడ్, నాయకులు రామ్మోహన్ చారి, జహీర్ ఖాన్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో (కేజీబీవీ) శుక్రవారం విద్యార్థినులకు యూనిఫార్ముల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జీఈసీఓ విజయలక్ష్మి, సెక్టోరల్ అధికారి-4 కృష్ణమూర్తి, స్థానిక మున్సిపల్ కార్పొరేటర్ యశోద ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థినులకు దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం అన్ని రకాల వసతులను కల్పిస్తోందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థినులు కేవలం చదువుకే పరిమితం కాకుండా క్రమశిక్షణ, నైతిక విలువలను అలవర్చుకుని ఉన్నత లక్ష్యాలను సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ నస్పూర్ స్పెషల్ ఆఫీసర్ ఎస్. మౌనిక, ఉపాధ్యాయ బృందం, పాఠశాల సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.
అమెరికాలో ప్రమాదానికి గురైన నస్పూర్ విద్యార్థిని.. అండగా నిలిచిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు
పాస్పోర్ట్, వీసాతో పాటు రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందజేత
నస్పూర్, ఆర్.కె న్యూస్: అమెరికాలో ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ పట్టణానికి చెందిన లగిశెట్టి స్పందన కుటుంబానికి మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పెద్ద దిక్కుగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు. లగిశెట్టి శ్రీనివాస్ కుమార్తె అయిన స్పందన ఉన్నత చదువుల కోసం అమెరికాలోని చికాగో నగరానికి వెళ్లింది. అయితే, ఇటీవల అక్కడి ఒక మెట్రో స్టేషన్లో స్పందన ప్రమాదవశాత్తు కిందపడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో ఆమె కోమాలోకి వెళ్లి ప్రస్తుతం అక్కడి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతోంది. కుమార్తె పరిస్థితి తెలిసి తీవ్ర ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులు తమకు అర్ధరాత్రి వేళ అమెరికా వెళ్లే మార్గం కనిపించక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును ఆశ్రయించారు. విషయం వినగానే చలించిపోయిన ఎమ్మెల్యే వెంటనే స్పందించారు. అత్యవసరంగా స్పందన తల్లిదండ్రులు అమెరికా వెళ్లేందుకు వీలుగా సీఎంఓ ఉన్నతాధికారులతో స్వయంగా మాట్లాడి పాస్పోర్ట్, అత్యవసర వీసా మంజూరు చేయించారు. అంతేకాకుండా, వారి విమాన ప్రయాణ టికెట్లు, ఇతర అత్యవసర ఖర్చుల నిమిత్తం రూ. 3,00,000 ఆర్థిక సాయాన్ని బాధిత తల్లిదండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ.. ఆ భగవంతుడి ఆశీస్సులతో స్పందన అతి త్వరగా కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. విదేశాల్లో ఉన్నా మన బిడ్డకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం తరపున కూడా అన్ని విధాలా ప్రయత్నిస్తామని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కష్టకాలంలో స్పందించి తమను అమెరికా పంపించే ఏర్పాట్లు చేసిన ఎమ్మెల్యేకు స్పందన తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
మంచిర్యాలలోని పలు డివిజన్లలో ఓటరు సవరణ ప్రక్రియ
నస్పూర్, ఆర్.కె న్యూస్: ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఓటు హక్కు రక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా, అప్రమత్తంగా వ్యవహరించాలని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పేర్కొన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9, 10, 30, 31, 33, 34, 37 డివిజన్లలో బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ఏజెంట్లు ఎస్ఐఆర్ (ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ)పై నిర్వహించిన ఇంటింటి సర్వే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటర్లను కలిసి, వారికి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేసి అవగాహన కల్పించారు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా ఉండేందుకు బూత్ స్థాయి ప్రతినిధులు క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నట్లు నాయకులు తెలిపారు. ప్రజలు తమ ఇంటికి వచ్చే అధికారులకు పూర్తి వివరాలు అందించి ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, టీపీసీసీ సభ్యుడు నూకల రమేష్, స్థానిక కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



