సెప్టెంబర్ 30 వరకు నోటీసుల పరిష్కారం… 4వ డివిజన్లో ఓటరు అవగాహన సదస్సు
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాలుగో డివిజన్లో గురువారం ఓటర్ల జాబితా పరిశీలన, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నస్పూర్ తహశీల్దార్ సంతోష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) చందర్, స్థానిక నాలుగో డివిజన్ కార్పొరేటర్ గుమ్మడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆగస్టు 17న విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా ఆధారంగా నో మ్యాపింగ్, అనోమలస్ ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. నోటీసులు అందుకున్న ఓటర్లు సెప్టెంబర్ 30వ తేదీ లోపు సరైన వివరాలు సమర్పించి తమ ఓటు హక్కును కాపాడుకోవాలని తహశీల్దార్ సంతోష్ కోరారు. ప్రభుత్వం గుర్తించిన 33 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక ధ్రువపత్రంతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీని సంబంధిత నోటీసుకు జతపరచాలని సూచించారు. నోటీసు జారీ అయిన వ్యక్తి తప్పనిసరిగా బూత్ లెవల్ అధికారి వద్ద హాజరై ప్రత్యక్షంగా ఫొటో దిగాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఓటర్లు నిర్లక్ష్యం చేయకుండా తమ వివరాలను సరిచూసుకోవాలని పిలుపునిచ్చారు. మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోని 93, 94, 95 బూత్లకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఓటరు జాబితాలోని తమ వివరాలను సరిచూసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాలుగో వార్డు అధికారి ఎం. నాగార్జున, బీఎల్ఓలు పి. లక్ష్మి, అనూష, బూత్ లెవల్ ఏజెంట్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.




