వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన జీఎం (పర్సనల్, ఐ.ఆర్ అండ్ పి.ఎం) కవితా నాయుడు
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణిలో కారుణ్య, వారసత్వ ఉద్యోగ నియామకాలను మరింత పారదర్శకంగా, వేగంగా చేపట్టేందుకు నూతనంగా ‘ప్రీ-హైరింగ్ అప్లికేషన్’ (టీ-కోడ్: వై-ఎంప్లాయ్) ను రూపొందించినట్లు జనరల్ మేనేజర్ (పర్సనల్, ఐ.ఆర్ అండ్ పి.ఎం) కవితా నాయుడు తెలిపారు. బుధవారం సింగరేణి ప్రధాన కార్యాలయం నుండి సిబ్బంది విభాగం (పర్సనల్) అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం కవితా నాయుడు మాట్లాడుతూ.. సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాలను నిర్వహించడానికి రూపొందించిన ఈ డిజిటల్ అప్లికేషన్ ద్వారా క్షేత్ర స్థాయిలో దరఖాస్తులు స్వీకరించడం నుండి సాప్ హెచ్.ఆర్ బృందం ద్వారా తుది నియామక ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రక్రియ అంతా సులభతరం అవుతుందన్నారు. ఈ విధానం ద్వారా వివరాల నమోదు, పరిశీలన, నియామక స్థానం కేటాయింపు వంటి అన్ని దశల్లో పారదర్శకత ఉంటుందని, కాలయాపన లేకుండా సకాలంలో పనులు పూర్తవుతాయని, పత్రాల నిర్వహణ ప్రామాణికంగా ఉంటుందని పేర్కొన్నారు. మాజీ ఉద్యోగి వివరాల నమోదు, ధృవీకరణ, ప్రాథమిక వైద్య పరీక్ష, పుట్టిన తేదీ నిర్ధారణ, ఓ.ఎస్.ఎల్ వివరాలు పంపడం, ఓ.ఎస్.ఎల్ చేరిక, పోస్టింగ్ వివరాలు, విధుల్లో చేరే ప్రక్రియ, హెచ్.ఆర్ సమీక్ష, తుది నియామకం.. ఇలా అన్ని దశలు ఈ యాప్ ద్వారానే జరుగుతాయని వివరించారు. అలాగే, ఒప్పంద కార్మికుల ఈ.ఎస్.ఐ వివరాల నమోదు ప్రక్రియను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ డీజీఎం (పర్సనల్) ఎస్. అనిల్ కుమార్, డిప్యూటీ పి.ఎం.లు ఎం. రాజేష్, జి.కె. కిరణ్ కుమార్, సీనియర్ పి.ఓ.లు ఎస్. సురేందర్, బి. మురళీ, ప్రశాంత్, సంక్షేమ అధికారులు, వివిధ గనుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







