ఐఎన్ టీయూసీ సెక్రటరీ జనరల్ బి. జనక్ ప్రసాద్
సింగరేణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలం
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి రెండేళ్లు గడుస్తున్నా, కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ పూర్తిగా విఫలమైందని ఐఎన్ టీయూసీ సెక్రటరీ జనరల్ బి. జనక్ ప్రసాద్ విమర్శించారు. బుధవారం నస్పూర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి వేదిక అయిన స్ట్రక్చర్ మీటింగ్ ను బహిష్కరించడం సిగ్గుచేటని, ఐఎన్ టీయూసీ చొరవతోనే మళ్లీ సమావేశం జరిగిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్మికుల సంక్షేమం కోసం పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందని జనక్ ప్రసాద్ తెలిపారు. కారుణ్య నియామకాల వయోపరిమితిని 35 నుండి 40 ఏళ్లకు పెంపు, కాంట్రాక్టు కార్మికులకు బోనస్, కోటి రూపాయల ప్రమాద బీమా, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇటీవల హైదరాబాద్లో మంత్రులను కలిసి కార్మికుల చిరకాల డిమాండ్లపై చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా ఆదాయపన్ను మినహాయింపు, సొంత ఇంటి పథకం అమలు, కొత్త బొగ్గు గనుల ప్రారంభం, పెండింగ్లో ఉన్న 3,700 కోర్టు కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ నిర్వహణ వంటి పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, వీటన్నింటిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. గత పదేళ్లుగా సంస్థను దోచుకున్న బీఆర్ఎస్ అనుబంధ సంఘం తీరును ఆయన తూర్పారబట్టారు. ఈ సమావేశంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు కాంపల్లి సమ్మయ్య, జెట్టి శంకర్ రావు, నాయకులు కలవేన శ్యామ్, ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.







