ఆర్.కె న్యూస్, మంచిర్యాల: సిమెంట్ ఇటుకల చాటున గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ రెమా రాజేశ్వరి తెలిపారు. బుధవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామగుండం సీపీ మాట్లాడుతూ, ఒడిశా రాష్ట్రం, మల్కన్ గిరి జిల్లా, చితాపరి గ్రామానికి చెందిన చిత్రసేన్ క్రిసాని, జగబందు క్రిసాని అనే అన్నదమ్ములు ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలించేవారని, ఈ నెల 22న రవాణా చేస్తున్న క్రమంలో రాత్రి శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం దగ్గర నేషనల్ హైవే పక్కన టైరు పంక్చర్ కావడంతో ట్రాక్టర్ ను అక్కడే వదిలిపెట్టి వెళ్లారని తెలిపారు. ఈనెల 23న పెట్రోలింగ్ చేస్తున్న శ్రీరాంపూర్ ఎస్ఐ ట్రాక్టర్ వద్ద ఎవరు లేకపోవడంతో సిబ్బందితో పోలీస్ స్టేషన్ కు తరలించారని, ట్రాక్టర్ కోసం ఎవరు రాకపోవడంతో అనుమానంతో 25న తనిఖీ చేయగా సిమెంట్ ఇటుకల కింద టేపు చుట్టి ఉంచిన 93 (465 కిలోలు) గంజాయి ప్యాకెట్లు కనిపించాయని తెలిపారు. అనంతరం గెజిటెడ్ ఆఫీసర్ సమక్షంలో పంచనామా నిర్వహించామన్నారు. గంజాయి విలువ 93 లక్షలు ఉంటుందని తెలిపారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు తెలంగాణ మీదుగా రవాణా చేస్తున్నారని, గంజాయి అక్రమ రవాణాలో కీలక వ్యక్తులు ఈశ్వర్, గురులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారులను సీపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి సుధీర్ రాంనాథ్ కేకన్, జైపూర్ ఏసీపీ బి. మోహన్, శ్రీరాంపూర్ సిఐ జి. రమేష్ బాబు, టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ సుధాకర్, ఎస్ఐలు ఎం. ప్రసాద్, కె. రాజేష్, ఉపేందర్, రాజ వర్ధన్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
337