నస్పూర్, ఆర్.కె న్యూస్: టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ బోర్డు ఆధ్వర్యంలో నస్పూర్ పట్టణంలోని శ్రీ సిద్ధి వినాయక గణేశ్ మండలి వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాలు పర్యావరణహితంగా నిర్వహిస్తున్నారు. సొసైటీ సొంత స్థలంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి పర్యవేక్షణలో తయారు చేసిన ప్రత్యేక బంక మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నిర్వహించిన కుంకుమ పూజకు మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఎన్జీవో అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ, టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో మొదటిసారి గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని, త్వరలోనే ఇదే స్థలంలో అందరి సలహా మేరకు ఆలయాన్ని నిర్మిస్తామని అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహక అధ్యక్షుడు, పర్యావరణ వేత్త, మట్టి విగ్రహ దాత గుండేటి యోగేశ్వర్ మాట్లాడుతూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూ అన్నదానం, ప్రసాద వితరణ, పూజలు, స్టీలు పళ్ళాలు, గ్లాసులు, ఆకు దొప్పలు వినియోగిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, గణపతి మండపం ఆవరణలో పచ్చని మొక్కలు ఏర్పాటు చేసామని, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు హబీబ్, రామ్మోహన్, పొన్న మల్లయ్య, మొండయ్య, నాగేశ్వర్, శ్రీపతి బాపురావు, సలహాదారులు, కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
41