టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును స్కిల్ డవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టు చేసి.. ఏసీబీ కోర్టు ఆదేశాలతో 14 రోజుల రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. అయితే, చంద్రబాబుకు బెయిల్ కోసం ఆయన తరుపు లాయర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ సీఎం చంద్రబాబుకు సంబంధించిన కీలక పిటిషన్ల విచారణ ఈ రోజు కోర్టులో జరగనుంది. సరైన సాక్ష్యాలు లేకుండానే జ్యుడిషియల్ రిమాండ్ విధించారంటూ చంద్రబాబు తరపు లాయర్లు పిటిషన్ వేశారు. ఈ నెల 10న ఏసీబీ కోర్టు విధించిన జ్యుడిషియల్ రిమాండ్ ఉత్తర్వులు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్పై విచారణ ముగిసే వరకూ ఏసీబీ కోర్టులో విచారణ నిలిపివేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరుతున్నారు. యాంటీ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 13, ఐపీసీ 409లు చెల్లవనీ.. రాజకీయ ప్రతీకారంతోనే ప్రాథమిక సాక్ష్యాలు లేకపోయినప్పటికీ కేసు పెట్టారని పిటిషన్లో పేర్కొన్నారు చంద్రబాబు తరపు న్యాయవాదులు. దీనిపై హైకోర్ట్ విచారణ చేపట్టబోతోంది. మాజీ సీఎం చంద్రబాబుకు సంబంధించిన కీలక పిటిషన్ల విచారణ జరగనుండటంతో ఉత్కంఠ నెలకొంది. ఇదిలాఉంటే.. చంద్రబాబును 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఇప్పటి వరకు చంద్రబాబు తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయలేదు. ఈ పిటీషన్ పై కూడా ఏసీబీ కోర్టు ఇవాళ విచారించనుంది.
284