‘యువత జర భద్రం’ లఘు చిత్రాన్ని ఆవిష్కరించిన మంచిర్యాల డీసీపీ భాస్కర్
నస్పూర్, ఆర్.కె న్యూస్: నేటి సమాజంలో యువత పెడదోవ పట్టి, చెడు వ్యసనాలకు బానిసలై తమ విలువైన జీవితాలను ఏ విధంగా నాశనం చేసుకుంటున్నారో కళ్లకు కట్టినట్లు చూపే ‘యువత జర భద్రం’ అనే లఘు చిత్రాన్ని మంచిర్యాల డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) ఎ. భాస్కర్ ఆవిష్కరించారు. మంగళవారం తన చాంబర్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత గుండేటి యోగేశ్వర్ మార్గదర్శకత్వంలో, ఉత్తమ ఎన్.సి.సి. క్యాడెట్ నార్ల మహేందర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పోస్టర్ను ఆయన విడుదల చేశారు.
- తప్పుడు స్నేహాలతో భవిష్యత్తు అంధకారం
ఈ సందర్భంగా డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ, యువత చదువును నిర్లక్ష్యం చేస్తూ, తప్పుడు స్నేహాల ప్రభావంతో గంజాయి, మద్యం, మాదకద్రవ్యాల వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడితే వారి భవిష్యత్తు ఏ విధంగా అంధకారమవుతుందో ఈ చిత్రంలో చక్కగా వివరించారని కొనియాడారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, క్రమశిక్షణతో కూడిన లక్ష్యాలను చేరుకోవాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. సామాజిక బాధ్యతతో ఈ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు నార్ల మహేందర్, ప్రోత్సహించిన యోగేశ్వర్, నటులు ఆకాష్, అనిల్, సాగర్ బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
యువతను మేల్కొలిపే సందేశంతో కూడిన ఈ లఘు చిత్రాన్ని ‘టీ బ్రేక్’ (Tea Break) యూట్యూబ్ ఛానల్లో వీక్షించవచ్చని నిర్వాహకులు తెలిపారు. సామాజిక స్పృహ కలిగించే ఇటువంటి ప్రయత్నాలను ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు.







