తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ జీవితం ఆదర్శప్రాయమని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. చాకలి ఐలమ్మ 128వ జయంతి సందర్భంగా మంగళవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా శాఖల కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి వినోద్ కుమార్, రజక సంఘాల నాయకులతో కలిసి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ విముక్తి ఉద్యమంలో నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందేందుకు సాగుతున్న పోరు ఐలమ్మ చేరికతో భూమి కోసం, భుక్తి కోసం రైతాంగ సాయుధ పోరాటంగా రూపుదాల్చిందని, వీర వనిత చిట్యాల చాకలి ఐలమ్మ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటానికి దిశానిర్దేశం చేసి చరిత్రలో చిరస్థాయిగా నిలిపిందని, దేశ్ ముఖ్ ను ఎదిరించిన వైనం మహిళా శక్తికి స్ఫూర్తిదాయకమని అన్నారు. 1940 దశకంలో బడుగు బలహీన వర్గాల కోసం, దుక్కి దున్నే వాడిదే భూమి అనే నినాదంతో భూస్వాములకు, రజాకార్ల అఘాయిత్యాలకు, ఆగడాలకు ఎదురు నిలిచిందని, దాదాపు పది లక్షల ఎకరాల భూమిని బడుగు బలహీన వర్గాలకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి, జయంతి సభలను ప్రభుత్వం అధికారికంగా చేపట్టడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, రజక సంఘాల నాయకులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
229