నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ పట్టణాన్ని శనివారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం 7 గంటలు దాటినా రహదారులపై కనీసం ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు తమ వాహనాలకు హెడ్ లైట్లు వేసుకుని నెమ్మదిగా ప్రయాణించాల్సి వచ్చింది. సాధారణంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఈ కోల్ బెల్ట్ ప్రాంతంలో, ఒక్కసారిగా ఊటీ, కొడైకెనాల్, కాశ్మీర్ వంటి పర్యాటక ప్రాంతాలను తలపించేలా వాతావరణం మారడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.
కార్మికులు, వాహనదారుల ఇబ్బందులు
శనివారం ఉదయం కురిసిన భారీ పొగమంచు కారణంగా జనజీవనం కొంత మేర అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా ఉదయం షిఫ్ట్ విధులకు హాజరయ్యే సింగరేణి కార్మికులు, పారిశుధ్య కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారులు స్పష్టంగా కనిపించకపోవడంతో వాహనదారులు, మార్నింగ్ వాకర్స్ గమ్యస్థానాలకు చేరుకోవడానికి తంటాలు పడ్డారు. అయితే, అరుదుగా కనిపించే ఈ వాతావరణాన్ని చూసి కొంతమంది యువత, స్థానికులు సెల్ఫీలు తీసుకుంటూ ఆహ్లాదంగా గడిపారు.
ఆందోళన కలిగిస్తున్న గాలి నాణ్యత
మరోవైపు, ఈ పొగమంచు వెనుక పర్యావరణ ముప్పు పొంచి ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో గాలి నాణ్యత సూచీ ఆన్లైన్లో ‘పూర్’ ఉన్నట్లు చూపించడం చర్చనీయాంశమైంది. తరచూ దేశ రాజధాని ఢిల్లీలో కనిపించే కాలుష్య వాతావరణం ఇక్కడ కూడా ప్రతిబింబిస్తోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మారుతున్న మానవ జీవన విధానం, పెరుగుతున్న వాతావరణ కాలుష్యమే ఇందుకు ప్రధాన కారణమని వారు విశ్లేషిస్తున్నారు.
పర్యావరణాన్ని కాపాడుకోవాలి
ప్రస్తుత పరిస్థితులపై పర్యావరణవేత్తలు స్పందిస్తూ.. పర్యావరణ వినాశనం వల్ల భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అడవుల పెంపకం, కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వారు పిలుపునిచ్చారు.








