ఏడో ఏడాది విజయవంతంగా చీరల పంపిణీ
ప్రజా సేవకే మా ప్రాధాన్యత: కొక్కిరాల సురేఖ
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల నియోజకవర్గ ఆడబిడ్డలకు సంక్రాంతి పండుగ వేళ గొప్ప కానుక అందింది. కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీరాంపూర్ కాలనీ ప్రగతి స్టేడియంలో చీరల పంపిణీ కార్యక్రమం వైభవంగా జరిగింది. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని శ్రీరాంపూర్ కాలనీ ప్రగతి స్టేడియం, కొత్త నాగార్జున కాలనీ ప్రాణహిత స్టేడియంలో స్థానిక మహిళలకు ఎమ్మెల్యే సతీమణి, జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఈ చీరలను అందజేశారు.
ఈ సందర్భంగా కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ.. 2018 సంవత్సరంలో ప్రారంభించిన ఈ చీరల పంపిణీ కార్యక్రమం ఈ ఏడాదితో విజయవంతంగా ఏడవ వసంతానికి చేరుకుందని తెలిపారు. గత బతుకమ్మ పండుగ సమయంలోనే ఈ చీరలను అందించాలని భావించినప్పటికీ, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అనారోగ్యానికి గురికావడంతో అది సాధ్యపడలేదని వివరించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో, సంక్రాంతి పండుగ పురస్కరించుకుని తన అక్కచెల్లెళ్లకు ఈ కానుకలు అందజేయాలని ఆయన కోరినట్లు వెల్లడించారు. తాము అధికారంలో లేనప్పుడు కూడా ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని ఆమె గుర్తుచేశారు.
నియోజకవర్గ అభివృద్ధికి ప్రేమ్ సాగర్ రావు కట్టుబడి ఉన్నారని, ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని సురేఖ పేర్కొన్నారు. ఇందులో భాగంగా మంచిర్యాల పట్టణంలో 320 కోట్ల రూపాయల వ్యయంతో 600 పడకల అత్యాధునిక ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. అలాగే లక్షెట్టిపేటలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల భవనాన్ని నిర్మించామని తెలిపారు. పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలనే తపనతోనే ప్రేమ్ సాగర్ రావు రాజకీయాల్లోకి వచ్చారని, ప్రజల సేవలో ఎప్పుడూ ముందుంటారని స్పష్టం చేశారు. ఆడబిడ్డలందరూ సంక్రాంతి వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని కోరుతూ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా ప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.









