- ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి
నస్పూర్, ఆర్.కె న్యూస్: ప్రజలకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సేవలు మరింత చేరువ చేయడానికి మంచిర్యాల జిల్లా నస్పూర్ లో ఏసీబీ ఆదిలాబాద్ రేంజ్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ తరుణ్ జోషి తెలిపారు. సోమవారం నస్పూర్ లో ఆదిలాబాద్ రేంజ్ ఏసీబీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, మంచిర్యాల పరిసర ప్రాంతాల నుంచి ఎక్కువ మొత్తంలో ఫిర్యాదులు రావడం, దూరాభారం కారణంగా ఆదిలాబాద్ లోని ఏసీబీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తమ దృష్టికి రావడం కారణంగా ఆదిలాబాద్ నుంచి ఏసీబీ రేంజ్ కార్యాలయాన్ని మంచిర్యాలకు మార్చామని, ఆదిలాబాద్ లోని ఏసీబీ కార్యాలయం యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. గత 3 సంవత్సరాలుగా అవినీతి నిరోధక శాఖ చాలా చురుకుగా పని చేస్తోందని, కేసుల విచారణలో ఏసీబీ అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తుందని, గత ఏడాది 216 కేసులు, ఈ ఏడాది ఇప్పటివరకు 82 కేసులు నమోదు చేసినట్లు, ఏసీబీ కేసుల్లో నిందితులకు శిక్షలు ఖరారు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. అవినీతి ఫిర్యాదుల కోసం ప్రజలు ఏసీబీ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా 1064 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా గానీ, వాట్సాప్ ద్వారా గానీ, ఏసీబీ వెబ్ సైట్ ద్వారా గానీ, మొబైల్ యాప్ ద్వారా గానీ ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. స్వీకరించిన ఫిర్యాదులపై తగు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో తాను ఉమ్మడి ఆదిలాబాద్ ఎస్పీగా పని చేశానని, జిల్లాపై తనకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. ఏసీబీ కార్యాలయానికి క్వార్టర్ కేటాయించిన సింగరేణి యాజమాన్యానికి కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రాజేష్ మురళి, రామగుండం కమిషనరేట్ సీపీ అంబర్ కిశోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్, ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్, కరీంనగర్ ఏసీబీ కోర్ట్ పిపి జ్యోతి, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, మంచిర్యాల రూరల్ సీఐ అశోక్, సిసిసి నస్పూర్ ఎస్సై ఉపేందర్ రావు, శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.