నియామక పత్రాన్ని అందజేసిన జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ ఏరియా బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఎన్నికల ఇన్చార్జిగా నస్పూర్ పట్టణానికి చెందిన వేముల కిరణ్ నియమితులయ్యారు. మంగళవారం నస్పూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఎస్పీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నియామకం చేపట్టినట్లు తెలిపారు. నస్పూర్ ఏరియాలో పార్టీ గెలుపునకు కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ వేముల కిరణ్ క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల-జగిత్యాల జోన్ ఇన్చార్జి కాదాసి రవీందర్, మంచిర్యాల జిల్లా ఇన్చార్జి దాగం శ్రీనివాస్, నాగుల కిరణ్ బాబు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.







