- శ్రీరాంపూర్ ఏరియా అధికారులతో జీఎం మునిగంటి శ్రీనివాస్ సమీక్ష
- గ్రేడ్ తగ్గితే సంస్థకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి సంస్థ అభివృద్ధిలో బొగ్గు నాణ్యత కీలక పాత్ర పోషిస్తుందని, వినియోగదారులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన బొగ్గును సరఫరా చేయాల్సిన బాధ్యత ప్రతి అధికారిపై ఉందని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ స్పష్టం చేశారు. సోమవారం శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏరియా ఉన్నతాధికారులతో బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, బొగ్గు నాణ్యత అంశాలపై ఆయన విస్తృత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ, మార్కెట్లో నాణ్యమైన బొగ్గుకు విపరీతమైన డిమాండ్ ఉన్నందున, బొగ్గు ఉత్పత్తి నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. గనుల నుండి వెలికితీసే బొగ్గు గ్రేడ్ తగ్గకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒకవేళ బొగ్గు గ్రేడ్ తగ్గినట్లయితే సంస్థకు లక్షలాది రూపాయల ఆదాయ గండి పడుతుందని, ఇది సంస్థ ఆర్థిక స్థితిగతులపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. రవాణా చేసే బొగ్గులో తుంటలు, షేల్, ఐరన్ వంటి ఇతర అనవసర పదార్థాలు కలవకుండా క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను కోరారు. గనుల విభాగంలోని వివిధ శాఖల అధికారులు ఒకరికొకరు సమన్వయంతో పని చేస్తూ నాణ్యత నియంత్రణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఏరియాకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను నిర్ణీత సమయంలోగా చేరుకోవడానికి ప్రతి ఉద్యోగి మరియు అధికారి అంకితభావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బెల్లంపల్లి రీజియన్ క్వాలిటీ జనరల్ మేనేజర్ వీరభద్ర రావు, ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, ఏరియా ఇంజనీర్ టి. రమణ, ఏజెంట్లు కుర్మ రాజేందర్, ఎన్. శ్రీధర్, జి. రవికుమార్, ప్రాజెక్ట్ ఆఫీసర్లు ఏ. వెంకటేశ్వర రెడ్డి, చిప్ప వెంకటేశ్వర్లు, క్వాలిటీ మేనేజర్ కె. వెంకటేశ్వర్ రెడ్డి, ఏరియా రక్షణాధికారి విజయకుమార్, డీజీఎంలు ఆనంద్ కుమార్, రవీందర్, మల్లయ్య, అన్ని గనుల మేనేజర్లు, గ్రూప్ ఇంజనీర్లు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.







