బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి
ప్రజలను వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికల్లో బుద్ధి చెప్పడం ఖాయం
బిజెపి జిల్లా కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: రాబోయే నగరపాలక సంస్థ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అధ్యక్షతన నగరపాలక సంస్థ నాయకులు, కార్యకర్తల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రఘునాథ్ వెరబెల్లి ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు.
వైఫల్యాల పాలనపై ధ్వజం: ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి కుంటుపడిందని, ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయని విమర్శించారు. మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్గా మార్చినప్పటికీ, కనీసం శాశ్వత వ్యర్థాల సేకరణ కేంద్రం (డంపింగ్ యార్డ్) ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. దీనివల్ల వార్డుల్లో చెత్త పేరుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్లు గడుస్తున్నా వరద ముంపు ప్రాంతాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేకపోయారని దుయ్యబట్టారు.
హామీల అమలులో విఫలం: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని, ప్రజలను మోసం చేయడంలో ఆ పార్టీ ముందంజలో ఉందని రఘునాథ్ విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో బిజెపి కార్యకర్తలు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈసారి మంచిర్యాల నగరపాలక సంస్థను బిజెపి కైవసం చేసుకోవడం చారిత్రక అవసరమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గాజుల ముఖేష్ గౌడ్, అమిరిశెట్టి రాజ్ కుమార్, సత్రం రమేష్, కుర్రె చక్రవర్తి, రంగ శ్రీశైలం, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, ఎనగందుల కృష్ణ మూర్తి, మోటపలుకుల తిరుపతి, బియ్యాల సతీష్ రావు, జోగుల శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.







