సింగరేణి డైరెక్టర్ కె. వెంకటేశ్వర్లు
బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతపై విస్తృత స్థాయి సమీక్ష
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి సంస్థ డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) కె. వెంకటేశ్వర్లు శనివారం శ్రీరాంపూర్ ఏరియాలో పర్యటించారు. ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్తో కలిసి ఆయన శ్రీరాంపూర్ ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. అనంతరం డైరెక్టర్ గనిలోని వ్యూ పాయింట్ సందర్శించి, పని ప్రదేశాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. గనిలో వినియోగంలో ఉన్న భారీ యంత్రాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గనిలో నిల్వ ఉన్న బొగ్గును వీలైనంత త్వరగా వినియోగదారులకు రవాణా చేయాలని అధికారులను ఆదేశించారు. రక్షణ నియమాలను పాటిస్తూనే, సంస్థ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించడానికి ప్రతి అధికారి, ఉద్యోగి అంకితభావంతో, పక్కా ప్రణాళికలతో ముందుకు సాగాలని డైరెక్టర్ పిలుపునిచ్చారు. ఉపరితల గనులకు అవసరమైన యంత్రాలను, ఇతర సామాగ్రిని ఎప్పటికప్పుడు సమకూర్చుకోవాలని తెలిపారు. ఓబీ కాంట్రాక్టు కంపెనీ ప్రతినిధులు, గని అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, ఏ నెల లక్ష్యాలను ఆ నెలలోనే అధిగమించాలని స్పష్టం చేశారు. రక్షణ విషయంలో రాజీ పడకుండా ఉత్పత్తిని పెంచడమే ధ్యేయంగా పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఓసీపీ ప్రాజెక్ట్ ఆఫీసర్ చిప్ప వెంకటేశ్వర్లు, ఇందారం ఓసీపీ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏ. వెంకటేశ్వర రెడ్డి, ఎస్సార్పీ ఓసీపీ మేనేజర్ ఇందూరి శ్రీనివాస్, ప్రాజెక్ట్ ఇంజనీర్ నాగరాజు, గ్రూప్ ఇంజనీర్ సాంబశివ రావు, రక్షణాధికారి శ్రీధర్, సర్వే అధికారి సంపత్, ఓబీ కాంట్రాక్టు కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.







