8
నస్పూర్, ఆర్.కె న్యూస్: నీటి వనరులు, నేల, చెట్లు, పర్యావరణ సంరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి వాల్టా అథారిటీ మండలి సభ్యుడిగా మంచిర్యాల జిల్లాకు చెందిన పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. గుండేటి యోగేశ్వర్ వాల్టా అథారిటీ మండలి సభ్యుడిగా నియమితులవ్వడం పట్ల పర్యావరణ ప్రేమికులు, మంచిర్యాల జిల్లా అధికారులు, పలు రంగాల ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జరిగిన రాష్ట్ర స్థాయి ప్రత్యేక సమావేశంలో గుండేటి యోగేశ్వర్ పాల్గొని “వాల్టా” చట్టం రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేయడానికి, నీటి వనరులు, అడవులు, నేల, పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యల పై పలు విలువైన సూచనలు చేశారు. ప్రజల్లో అవగాహన కలిగించే పలు కరపత్రాల రూపకల్పనపై తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. అనంతరం “వాల్టా ” చట్టం అమలకు ఉపయోగపడే మంచిర్యాల జిల్లాలోని వివిధ మండలాల్లో ఉన్న నీటి వనరులు, అటవీ విస్తీర్ణం అంశాలపై రాసిన మంచిర్యాల జిల్లా స్వరూపం పుస్తకాన్ని మంత్రి సీతక్కకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క యోగేశ్వర్ చేస్తున్న కృషిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిక చేసిన రాష్ట్ర ప్రభుత్వ వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, ఐఏయస్, ఐఎఫ్ఎస్ అధికారులు, పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు.