మంచిర్యాల జ్యోతిబాపూలే గురుకుల కళాశాలను సందర్శించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: చదువుతోనే విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుందని, విద్యా రంగం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ అన్నారు. మంగళవారం ఆయన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలోని తరగతి గదులు, వసతి సౌకర్యాలు, విద్యాబోధన తీరును ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం ఎంపీ వంశీకృష్ణ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. కళాశాలలో అందుతున్న సౌకర్యాలు, భోజన నాణ్యత, చదువులో ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. “విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా నేను మీ వెంట ఉంటా” అని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు. కళాశాలకు అవసరమైన అదనపు మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కళాశాల సందర్శనకు విచ్చేసిన ఎంపీకి ప్రిన్సిపాల్ డాక్టర్ కె. పురుషోత్తం, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు సాదర స్వాగతం పలికారు. కళాశాల అభివృద్ధిపై ఎంపీ చూపుతున్న చొరవకు ధన్యవాదాలు తెలుపుతూ ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.








