ముగ్గుల పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థినులు
నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ పరిధిలోని సింగరేణి కాలనీస్ పాలీటెక్నిక్ కళాశాలలో శనివారం సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. పండుగను పురస్కరించుకుని విద్యార్థినులకు నిర్వహించిన ముగ్గుల పోటీలు ఆకట్టుకున్నాయి. సంప్రదాయ కళల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ పోటీల్లో 17 మంది విద్యార్థినిలు బృందాలు పాల్గొని తమ సృజనాత్మకతను చాటాయి. కళాశాల ప్రాంగణమంతా రంగురంగుల ముగ్గులతో కళకళలాడింది.
ఈ పోటీలకు శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్ సతీమణి ఉమరాణి, ఎస్ఓ టు జీఎం సత్యనారాయణ సతీమణి అరుణ, జీఎం క్వాలిటీ వీరభద్రరావు సతీమణి కవిత న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. విద్యార్థినులు వేసిన ముగ్గులను పరిశీలించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి మొదటి, రెండు, మూడు బహుమతులు ప్రకటించారు. పోటీల్లో పాల్గొన్న మిగిలిన విద్యార్థినులకు సైతం ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.
కళాశాల ప్రిన్సిపాల్ ఎన్. దినీల్ కుమార్ మాట్లాడుతూ, చదువుతో పాటు విద్యార్థుల్లో దాగి ఉన్న కళాత్మక నైపుణ్యాలను వెలికితీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. భావి భారత పౌరులైన విద్యార్థులు భారతీయ సంప్రదాయాలను, కళలను గౌరవించాలని కోరారు. పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థినులను ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.








