- ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి
- ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
నస్పూర్, ఆర్.కె న్యూస్: చదువులో వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ట్రస్మా ఆధ్వర్యంలో బుధవారం నస్పూర్ పట్టణంలోని ఎంఎం గార్డెన్ లో మంచిర్యాల జిల్లాకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి, ఎంఈవో పద్మజ, ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మత్తెత్తుల రాజేంద్రపాణి, జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి అభినందనలు తెలియజేశారు. రోజు రోజుకు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఉపాధ్యాయులు నూతన విద్యా విధానంపై దృష్టిసారించాలని సూచించారు. 2026-27 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో కొత్త విద్యా పాలసీ రాబోతుందని, దీంతో విద్యా విధానంలో అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు చెప్పారు. పిల్లలకు అర్థమైయ్యే విధంగా పాఠాలు బోధించాలని, ముఖ్యంగా పిల్లలతో ఎక్కువగా ప్రాక్టీస్ చేపిస్తే ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు తమ సబ్జెక్టులపై పట్టుసాధిస్తే విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దవచ్చని సూచించారు. అనంతరం ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెత్తుల రాజేంద్రపాణి, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, ట్రస్మా ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా బోధన చేస్తున్న ఉపాధ్యాయులకు త్వరలోనే హెల్త్ స్కీంను ప్రారంభించడం జరుగుతుందన్నారు. తాము ఇతర సంఘాల మాదిరిగా కాకుండా ఒక క్రమశిక్షణతో విద్యా సంస్థలను నడిపిస్తూ విద్యాబోధన, ఉపాధ్యాయుల సంక్షేమం, పలు సేవా కార్యక్రమాలను స్వంత ఖర్చులతో చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లాలోని పలు ప్రైవేటు పాఠశాలలకు చెందిన 78 మంది ఉత్తమ ఉపాధ్యాయులను, ప్రైవేటు పాఠశాలల్లో విద్యా బోధన చేసి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా కొనసాగుతున్న పలువురిని శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించి, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా నాయకులు శ్యాంసుందర్ రెడ్డి, రజనీ, రేగళ్ల ఉపేందర్, మైదం రామకృష్ణ, ఊట్ల సత్యనారాయణ, అంబాల రాజ్ కుమార్, పెట్టం మల్లయ్య, బత్తిని దేవన్న, కృష్ణారెడ్డి, అమన్ ప్రసాద్, జిల్లాలోని పలు పాఠశాలలకు చెందిన కరస్పాండెంట్లు, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, ట్రస్మా ప్రతినిధులు పాల్గొన్నారు.