కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
సానుకూలంగా స్పందించిన యాజమాన్యం
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ బి. జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు శుక్రవారం శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిని ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ నాయకులు సందర్శించారు. సంఘం సీనియర్ కేంద్ర ఉపాధ్యక్షులు జెట్టి శంకర్ రావు, ఉపాధ్యక్షులు గరిగ స్వామి, పి. తిరుపతి రాజు గని పిట్ కార్యదర్శి ఓరం జగన్ నేతృత్వంలో ఎస్సార్పీ ఓసీపీని సందర్శించారు. మధ్యాహ్నం రెండవ షిఫ్ట్ సమయంలో నాయకులు నేరుగా ఎలక్ట్రికల్ సూపర్వైజర్లు, టెక్నీషియన్లు, ఈపీ ఆపరేటర్లు, ఇతర కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను నాయకులు గుర్తించారు. ఈపీ ఆపరేటర్లు, ఎలక్ట్రికల్ ఫోర్మెన్లు, హెల్పర్ల కొరత వల్ల ఉన్న సిబ్బందిపై పనిభారం పెరుగుతోందని, దీనివల్ల భద్రత మరియు ఉత్పత్తి దెబ్బతింటున్నాయని కార్మికులు వాపోయారు. అలాగే ఎనిమిది గంటల నిరంతర పని వల్ల కలిగే అలసటను దృష్టిలో ఉంచుకుని లంచ్ అవర్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై నాయకులు యాజమాన్యంతో చర్చించగా, సానుకూల చర్యలు తీసుకుంటామని హామీ లభించింది. ఈ కార్యక్రమంలో షిఫ్ట్ ప్రతినిధులు, టెక్నీషియన్లు, ఈపీ ఆపరేటర్లు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



