నస్పూర్, ఆర్.కె న్యూస్: రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికలలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికై, బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ధర్ని మధుకర్, సల్ల రమ్య బుధవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ను మర్యాదపూర్వకంగా కలిశారు. నస్పూర్లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో (కలెక్టరేట్) కలెక్టర్ ఛాంబర్కు వెళ్లిన వారు, ఆయనకు మొక్కలను అందజేశారు.
25 February 2026
భీమారం పీఎం శ్రీ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు
భీమారం, ఆర్.కె న్యూస్: పరీక్షల సమయంలో ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికాకూడదని రాష్ట్రపతి అవార్డు గ్రహీత, పీఎం శ్రీ పాఠశాలల వ్యక్తిత్వ వికాస నిపుణుడు గుండేటి యోగేశ్వర్ అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా భీమారం పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గతంలో ఎన్నో పరీక్షలు రాసిన అనుభవంతో పదో తరగతిని అవలీలగా ఎదుర్కోవాలని విద్యార్థులకు సూచించారు. పరీక్షల్లో విజయం సాధించడానికి పాటించాల్సిన సూత్రాలు, బలాలు, బలహీనతలు, ఆత్మవిశ్వాసం పెంపొందించుకునే విధానాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. పరీక్షల సమయంలో అనుసరించాల్సిన చదువు పద్ధతులు, జ్ఞాపకశక్తిని పెంచుకునే చిట్కాలను విద్యార్థులకు వివరించారు. పేదరికం నుండి ఉన్నత స్థాయికి ఎదిగిన ప్రముఖుల జీవన గాథలను వివరిస్తూ వారిలో మనో ధైర్యాన్ని నింపారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసి, పరీక్షలను నిర్భయంగా ఎదుర్కొంటామని వారితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, సమన్వయకర్త తిరుపతి, ఉపాధ్యాయులు షారీక్, మారయ్య, సలీం, శ్రీదేవి, గోవర్ధన చారి, ఐటీ నిష్ణాతులు శరత్ చంద్ర, రాజశేఖర్ పాల్గొన్నారు.

పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి.. రేపు నగరంలో స్పెషల్ డ్రైవ్
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల నగర పాలక సంస్థ అభివృద్దే మన ప్రధాన ధ్యేయమని మేయర్ ధర్ని మధుకర్ పేర్కొన్నారు. మంచిర్యాల నగర పాలక సంస్థ పరిధిలోని 10, 30, 32వ డివిజన్లలో బుధవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. పారిశుద్ధ్య పనులు, రహదారుల నిర్మాణ ప్రగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ కమిషనర్ అన్వేష్, స్థానిక కార్పొరేటర్లతో కలిసి వార్డుల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నగర సుందరీకరణ, ప్రజల సౌకర్యార్థం చేపట్టే పనుల్లో నిర్లక్ష్యం వహించకూడదని అధికారులకు స్పష్టం చేశారు. పర్యటనలో భాగంగా డివిజన్ల వారీగా పారిశుద్ధ్య పరిస్థితులను మేయర్ సమీక్షించారు. డ్రైనేజీల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. గురువారం నగరం అంతటా ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించి మురుగు కాల్వలను శుభ్రం చేయాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. రహదారుల నిర్మాణ పనుల వివరాలను కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. పనులు నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పాలక వర్గం పనిచేస్తుందని వెల్లడించారు. ప్రజల నుంచి అందిన వినతులపై సానుకూలంగా స్పందించిన మేయర్, క్షేత్రస్థాయిలో పనుల పర్యవేక్షణ నిరంతరం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 10వ డివిజన్ కార్పొరేటర్ రాచకొండ గోపాల్ రావు, 30వ డివిజన్ కార్పొరేటర్ కర్రె శ్రీనివాస్, నగర పాలక సిబ్బంది, ఆయా వార్డుల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




