నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అత్యంత పారదర్శకంగా, విజయవంతంగా ముగించినందుకు గాను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ను పంచాయతీ రాజ్ శాఖ అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లా కలెక్టర్ సారధ్యంలో ఎన్నికల ప్రక్రియ అంతా సజావుగా సాగిందని, ఎక్కడా ఎలాంటి ఒడిదుడుకులు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నారని అధికారులు కొనియాడారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) డి. వెంకటేశ్వరరావు, డివిజనల్ పంచాయతీ అధికారి కొమ్మెర సతీష్, జిల్లా పంచాయతీ కార్యాలయ సిబ్బంది కలెక్టరేట్లో కలెక్టర్ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు ఎం. మోహన్, ఆర్. మహేందర్, పి. శ్రీనివాస్, ఎన్. రాజేశ్వర్, బి. గంగ మోహన్, ఎంపీఓలు శ్రీపతి బాపన్న, అజ్మత్, బి. శ్రీనివాస్, వి. శ్రీనివాస్, ఎన్. శ్రీనివాస్, ఎం. సత్యనారాయణ, అనిల్ కుమార్, సతీష్ కుమార్, అక్తర్, ప్రసాద్, జలంధర్ తదితరులు పాల్గొని కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
KYATHAM RAJESH
శోభాయాత్రగా చిత్రపటాల ఊరేగింపు.. భక్తిపారవశ్యంలో ఏఎస్ఆర్ఆర్ నగర్
నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ మండలంలోని అల్లూరి సీతారామరాజు నగర్లో గల అభయాంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం అర్ధరాత్రి వరకు అయ్యప్పస్వామి మహా పడిపూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఏఎస్ఆర్ఆర్ నగర్ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు బోయిని కుమారస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు సంగనబట్ల నరహరిశర్మ గురుస్వామి పూజాదికాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముందు అయ్యప్ప, గణపతి, కుమారస్వామి చిత్రపటాలను కాలనీలో భక్తులు, స్వాములు శోభాయాత్రగా పూజా మందిరం వరకు తీసుకువచ్చారు. పడిపూజలో భాగంగా 18 కలశాలతో, 18 రకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. భక్తుల కాలు భజన, అఖండ భజనలతో ఆ ప్రాంతమంతా అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ ధర్ని మధుకర్, అఖిల భారతీయ అయ్యప్ప ధర్మప్రచార సమితి శ్రీరాంపూర్ అధ్యక్షుడు బొడ్డు లచ్చన్న, రాష్ట్ర మీడియా ఇంచార్జి భాస్కర్ల రాజేశం, ఉపాధ్యక్షుడు రఘుపతిరావు, అయ్యప్ప సేవా సమితి సభ్యులు కొత్తగట్టు శ్రీనివాసచారి, ముల్కల రవికృష్ణ, అప్పయ్య, నగేష్, అరుణ్ కుమార్, సంపత్, ప్రసాదాచారి, ఆలయ కార్యదర్శి ముత్తె రాజయ్య, లక్ష్మణరావు, కొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఏఐతో ఫోటో సృష్టించిన నిందితుడిపై కేసు నమోదు
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల జిల్లా నస్పూర్ సిసిసి టౌన్ షిప్ పరిధిలో బుధవారం రాత్రి పులి సంచరిస్తోందంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం పూర్తిగా అవాస్తవమని జిల్లా అటవీ అధికారి (డిఎఫ్ఓ) శివ్ ఆశిష్ సింగ్ స్పష్టం చేశారు. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాంకేతికతతో ఒక వ్యక్తి పులి ఫోటోను సృష్టించి తప్పుడు ప్రచారం చేశారని ఆయన తెలిపారు. పులి వార్తలతో ప్రజలు ఆందోళన చెందడంతో డిఎఫ్ఓ శివ్ ఆశిష్ సింగ్, రేంజ్ ఆఫీసర్ రత్నాకర్ ఆధ్వర్యంలో పది బృందాలు రంగంలోకి దిగాయి. డ్రోన్ కెమెరాల సహాయంతో ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా, ఎక్కడా పులి జాడ గానీ, పాదముద్రలు గానీ లభించలేదు. దీంతో అది తప్పుడు ఫోటో అని అధికారులు ధ్రువీకరించారు. సాంకేతిక పరిజ్ఞానంతో తప్పుడు ఫోటో సృష్టించిన వ్యక్తిని గుర్తించిన అధికారులు, అతడిని సంఘటనా స్థలానికి తీసుకువచ్చి అది ఫేక్ అని ఒప్పించారు. ప్రజలను భయాందోళనకు గురిచేసిన సదరు వ్యక్తిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వదంతులు నమ్మవద్దని, ఏదైనా సమాచారం ఉంటే 9440313191, 9441533220 నెంబర్లకు తెలపాలని అధికారులు కోరారు.
గతంలో రూ. 3.30 లక్షలు.. ఇప్పుడు కేవలం రూ. 60 వేలేనా?
యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి: బాజీ సైదా
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు అత్యంత వైభవంగా జరుపుకునే సింగరేణి ఆవిర్భావ దినోత్సవ నిధులను యాజమాన్యం భారీగా తగ్గించడాన్ని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్.కే. బాజీ సైదా, ఉపాధ్యక్షులు కొట్టే కిషన్ రావు, సహాయ కార్యదర్శి మోత్కూరు కొమురయ్య గురువారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి, ప్రకృతితో పోరాడి బొగ్గు ఉత్పత్తి చేస్తూ సంస్థను లాభాల బాటలో నడిపిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఏటా సింగరేణి దినోత్సవం సందర్భంగా శ్రీరాంపూర్ డివిజన్కు గతంలో రూ. 3,30,000 నిధులు కేటాయించేవారని, ఆ నిధులతో ముగ్గుల పోటీలు, క్రీడలు, వెల్ బేబీ షో వంటి కార్యక్రమాలు నిర్వహించి కార్మిక కుటుంబాల్లో పండుగ వాతావరణం నింపేవారని గుర్తు చేశారు. కానీ, ఈ ఏడాది ఆ నిధులను ఏకంగా 25 శాతానికి తగ్గించి, కేవలం రూ. 60,000 మాత్రమే మంజూరు చేయాలని నిర్ణయించడం విడ్డూరంగా ఉందన్నారు. సంస్థకు సంబంధం లేని ఇతర జిల్లాలకు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్న యాజమాన్యం, కార్మికుల ఆనందం కోసం నిర్వహించే వేడుకల నిధుల్లో కోత విధించడం సరికాదని వారు ధ్వజమెత్తారు. యాజమాన్యం తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయం వల్ల కార్మిక కుటుంబాలు ఉత్సవాలకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే యాజమాన్యం స్పందించి, గతంలో ఇచ్చిన నిధుల కంటే అదనపు నిధులు మంజూరు చేయాలని ఏఐటీయూసీ నేతలు డిమాండ్ చేశారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఆనందోత్సవాల మధ్య సింగరేణి దినోత్సవాన్ని జరుపుకునేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంటేనే మెరుగైన భవిష్యత్తు
చిన్నారుల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్
నస్పూర్, ఆర్.కె న్యూస్: చిన్నారులు చిన్నప్పటి నుండే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని, ముఖ్యంగా మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి ఆటలు, వ్యాయామం మరియు చదువుపై దృష్టి సారిస్తేనే మెరుగైన భవిష్యత్తు ఉంటుందని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గురువారం డిప్యూటీ సీఎంఓ డాక్టర్ పి. రమేష్ బాబు ఆధ్వర్యంలో నస్పూర్ డిస్పెన్సరీలో వెల్ బేబీ షో కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్, సేవా అధ్యక్షురాలు మునిగంటి ఉమరాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిన్నారుల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించి, వారికి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ, చిన్నారుల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, శిశు సంరక్షణ పద్ధతులపై తల్లిదండ్రులకు మార్గదర్శనం చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి చిన్నారి భవిష్యత్తు ఎంతో విలువైనదని, చిన్నప్పటి నుండే ఆరోగ్యకరమైన అలవాట్లు పెంపొందించుకోవాలని సూచించారు. ముఖ్యంగా నేటి కాలంలో పిల్లలు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి, ఆటపాటలు, వ్యాయామం మరియు చదువుపై దృష్టి సారించాలని కోరారు. పిల్లలకు వేయించాల్సిన టీకాలు, పౌష్టికాహారం మరియు క్రమబద్ధమైన వైద్య పరీక్షల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా బహుమతులు అందజేస్తామని ఆయన ప్రకటించారు.
పౌష్టికాహారం, పరిశుభ్రతతోనే దృఢమైన ఎదుగుదల
సేవా అధ్యక్షురాలు మునిగంటి ఉమరాణి మాట్లాడుతూ, చిన్ననాటి ఆరోగ్యం బాగుంటేనే భవిష్యత్తులో పిల్లలు శారీరక, మానసిక దృఢత్వాన్ని పొందుతారని వివరించారు. తల్లులు పిల్లల పోషణ మరియు పరిశుభ్రత విషయంలో కనీస అవగాహన కలిగి ఉండాలని, ఇటువంటి కార్యక్రమాలు తల్లిదండ్రుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని ఆమె హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, సీనియర్ పీవో ఎస్. సురేందర్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి. మురళీధర్ రావు, డాక్టర్ మనీషా, పిట్ కార్యదర్శి విజయలక్ష్మి, వివిధ విభాగాల వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఘనంగా జాతీయ పింఛనుదారుల దినోత్సవం
పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
నస్పూర్, ఆర్.కె న్యూస్: ”పెన్షన్ అనేది ప్రభుత్వం వేసే బిక్ష కాదు.. అది పెన్షనర్ల హక్కు” అని సర్వోన్నత న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పునిచ్చిన రోజును పురస్కరించుకుని, మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పెన్షన్ భవన్లో జాతీయ పింఛనుదారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ధరం స్వరూప్ నాకరా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, 1982 డిసెంబర్ 17న నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వై.వి. చంద్రచూడ్ ఇచ్చిన తీర్పు పెన్షనర్ల జీవితాల్లో వెలుగులు నింపిందని కొనియాడారు. పెన్షనర్ల ఆత్మగౌరవం కోసం న్యాయపోరాటం చేసిన డి.ఎస్. నాకరా, అద్భుతమైన తీర్పునిచ్చిన జస్టిస్ చంద్రచూడ్ సేవలు చిరస్మరణీయమని, వారు యావత్ పెన్షనర్లకు గర్వకారణమని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ, పెన్షనర్ల పట్ల వ్యతిరేక విధానాలను అవలంబించడం శోచనీయమని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రకాల జబ్బులకు, అన్ని ఆసుపత్రుల్లో వైద్యం అందించేలా హెల్త్ కార్డులను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెన్షనర్ల సహనాన్ని పరీక్షించకుండా, జేఏసీతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని కోరారు. 2024 తర్వాత పదవీ విరమణ చేసిన వారికి తక్షణమే పెన్షనరీ బెనిఫిట్స్ విడుదల చేయాలని, పెండింగ్ బిల్లులన్నింటినీ వెంటనే మంజూరు చేయాలని, పెన్షనర్ల సమస్యల తక్షణ పరిష్కారానికి ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వేడుకల్లో భాగంగా సీనియర్ పెన్షనర్లు కె. నారాయణ, వి.ఎల్. నరసింహులను శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పెన్షనర్లు ఒకరికొకరు దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్ అధ్యక్షుడు కె. సుధాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కైరం జనార్ధన్, జిల్లా ఉపాధ్యక్షులు బి. సత్యనారాయణ, రాష్ట్రపతి అవార్డు గ్రహీత గుండేటి యోగేశ్వర్, నాయకులు కె. జగదీశ్వర్, ఎన్. రామన్న, కె. హనుమంతరావు, ఆండాలమ్మ, కె. నాగేశ్వర్, కె. వైకుంఠం, పి. పాపారావు, పి. తిరుపతి, బి. రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.

వివరాలు వెల్లడించిన అధ్యక్షులు చిలగాని బొడ్డయ్య, సిరిపురం రామన్న
నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ పద్మశాలి సంక్షేమ సంఘం, శ్రీ లక్ష్మీ గణపతి శివ మార్కండేయ దుర్గామాత దేవాలయ కమిటీ నూతన కార్యవర్గ ఎన్నికను జనవరి 4వ తేదీన నిర్వహించనున్నట్లు పద్మశాలి సంఘం అధ్యక్షులు చిలగాని బొడ్డయ్య, ఆలయ కమిటీ అధ్యక్షులు సిరిపురం రామన్న తెలిపారు. బుధవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రస్తుత కమిటీల కాలపరిమితి ముగిసిన దృష్ట్యా, పాత కార్యవర్గాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నూతన కమిటీల ఎంపిక ప్రక్రియను మంచిర్యాల జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు గాధాసు బాబు, గౌరవాధ్యక్షులు గడ్డం సుధాకర్, మందమర్రి పట్టణ అధ్యక్షులు చిలగాని సుదర్శన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు వివరించారు. వచ్చే నెల 4వ తేదీన ఉదయం 10 గంటలకు స్థానిక శ్రీ లక్ష్మీ గణపతి శివ మార్కండేయ దుర్గామాత దేవాలయ ప్రాంగణంలో ఈ ఎన్నిక ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు. పద్మశాలి కుల బాంధవులు, స్థానిక భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని, నూతన కమిటీల ఎంపిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వేముల సురేష్, చిప్ప రాజబాబు, కొండ శ్రీనివాస్, కుందారపు రమేష్, శరవందం, దేవసాని నాగరాజు, పాటేటి శంకర్, కుసుమ శంకర్, కుందారపు రాములు, సట్కూరి రవీందర్, కుంట రామన్న, ఆడేటి రాజన్న, జక్కెన సర్వేశం తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా జాతీయ పింఛనుదారుల దినోత్సవం
విశ్రాంత ఉద్యోగి తిరుపతిరెడ్డికి సన్మానం
నస్పూర్, ఆర్.కె న్యూస్: ప్రతి ప్రభుత్వ ఉద్యోగి రేపటి పింఛనుదారుడేనని, సీనియర్ సిటిజన్లు, పింఛనుదారులను గౌరవించడం ప్రభుత్వాల, సమాజం కనీస బాధ్యతని కలెక్టరేట్ ఏరియా వాకర్స్ హెల్త్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు గుండేటి యోగేశ్వర్, ప్రధాన కార్యదర్శి కస్తూరి నాగేశ్వరరావు అన్నారు. జాతీయ పింఛనుదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్ ఏరియా వాకర్స్ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్రాంత అటవీ శాఖ సూపరింటెండెంట్, టీఎన్జీవోస్ మాజీ మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు తిరుపతిరెడ్డిని శాలువా, పుష్పగుచ్ఛంతో ఘనంగా సన్మానించి, ఉద్యోగ బాధ్యతల్లో వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. వృద్ధాప్యంలో పింఛనుదారులు గౌరవప్రదమైన, ప్రశాంతమైన జీవనాన్ని సాగించేలా చూడాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులు, ముఖ్యంగా నేటి యువతపై ఉందని గుర్తుచేశారు. వారికి అన్ని విధాలా సహకరిస్తూ, వారి హక్కులను కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ హెల్త్ క్లబ్ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, సిజ్జు, వెంకటేశం, వియాన్, ప్రేమ్, రమేష్ మరియు ఇతర వాకర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు.
శ్రీరాంపూర్ ఉపరితల గనిలో 56వ రక్షణ పక్షోత్సవాలు
హాజరైన ఉన్నతాధికారులు
నస్పూర్ , ఆర్.కె న్యూస్: రక్షణ ప్రమాణాలను పాటిస్తూ అధిక ఉత్పత్తిని సాధించడం సంస్థకు గర్వకారణమని, రక్షణతో కూడిన ఉత్పాదకతే సంస్థ ప్రధాన లక్ష్యమని సింగరేణి ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. మంగళవారం శ్రీరాంపూర్ ఏరియాలోని శ్రీరాంపూర్ ఉపరితల గనిలో 56వ వార్షిక రక్షణ పక్షోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రక్షణ వారోత్సవాల తనిఖీ కమిటీ కన్వీనర్, జనరల్ మేనేజర్ (ఆర్ అండ్ డి) చిట్టా వెంకటరమణ, జనరల్ మేనేజర్ (సేఫ్టీ, బెల్లంపల్లి రీజియన్) రఘు కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై పక్షోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శ్రీరాంపూర్ ఏరియా మొత్తం బొగ్గు ఉత్పత్తిలో సుమారు 54 శాతం వాటా ఉపరితల గనిదేనని ప్రశంసించారు. భవిష్యత్తులో చిన్న ప్రమాదం కూడా జరగకుండా ప్రతి ఉద్యోగి అప్రమత్తంగా ఉండాలన్నారు. విధులకు హాజరయ్యే సమయంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, మస్టర్ సమయానికి ముందే గనిని చేరుకొని పనిని ఆరంభించాలని సూచించారు. ముఖ్యంగా షావల్స్, డంపర్ల వంటి భారీ యంత్రాలు నడిపే సమయంలో ఎస్.ఓ.పి ప్రకారం రక్షణ పద్ధతులను కఠినంగా పాటించాలని, పనిలో తొందరపాటు వద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యోగులు ప్రదర్శించిన సి.పి.ఆర్ విధానం, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం ఎన్. సత్యనారాయణ, గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, గని ప్రాజెక్ట్ అధికారి చిప్ప వెంకటేశ్వర్లు, ఏరియా రక్షణాధికారి విజయ్ కుమార్, ఇన్స్పెక్షన్ కమిటీ సభ్యులు, గని మేనేజర్ ఇందూరి శ్రీనివాస్, ప్రాజెక్ట్ ఇంజనీర్ నాగరాజు, గని రక్షణాధికారి శ్రీధర్, సంక్షేమ అధికారి ఓంకార్ బాబు, పిట్ కార్యదర్శి లచ్చన్న, రక్షణ కమిటీ సభ్యులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణిలో పనిచేసి పదవీ విరమణ పొందిన కార్మికులకు చెల్లించాల్సిన లాభాల వాటా, పి.ఎల్.ఆర్ బోనస్లను యాజమాన్యం వెంటనే చెల్లించాలని, లేనియెడల ఆందోళన తీవ్రతరం చేస్తామని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం హెచ్చరించింది. మంగళవారం యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షులు బండి రమేష్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెగ్యులర్ కార్మికులకు లాభాల వాటా, బోనస్ చెల్లించి మూడు నెలలు గడుస్తున్నా, విశ్రాంత కార్మికులను విస్మరించడం యాజమాన్యం నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన రిటైర్డ్ కార్మికుల శ్రమను గౌరవించకుండా, మానవత్వం మరిచి ప్రవర్తించడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం సంస్థకు సంబంధం లేని అంశాలపై కోట్ల రూపాయలను వృధా చేస్తూ, కార్మికులకు న్యాయంగా రావాల్సిన డబ్బును ఆపడం వెనుక ఆంతర్యం ఏమిటని వారు సూటిగా ప్రశ్నించారు. తక్షణమే విశ్రాంత కార్మికులకు లాభాల వాటా, పిఎల్ఆర్ బోనస్ ప్రకటించాలని, లేనిపక్షంలో రిటైర్డ్ కార్మికులను కలుపుకొని సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని జి.ఎం కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.



