KYATHAM RAJESH
- ప్రకృతి మిత్ర స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు గుండేటి యోగేశ్వర్
నస్పూర్, ఆర్.కె న్యూస్: బాలల జన్మదిన వేడుకలు పర్యావరణానికి హాని కలగకుండా ప్రకృతి మిత్ర గా జరుపుకోవడం ఆదర్శనీయమని “ప్రకృతి మిత్ర” స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు, పర్యావరణ వేత్త గుండేటి యోగేశ్వర్ అన్నారు. ఆదివారం రాత్రి మంచిర్యాల కార్పొరేషన్ పరిధి నస్పూర్ లోని ఓ మాక్స్ విల్లా కాలనీలో గుండేటి సుధీర్,శ్వేత దంపతుల కుమారుడు శౌర్య జన్మదిన దినాన్ని పురస్కరించుకొని సింగిల్ యూజ్ ప్లాస్టిక్, బేకరీ కి సంబంధించిన కేక్, జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ లేకుండా ప్రకృతి సిద్ధమైన పుచ్చకాయతో కళాత్మకంగా రెండవ జన్మదిన కేక్ తయారు చేశారు. వేడుకలకు హాజరైన బాలలకు, ఆహ్వానితులకు వివిధ పోషకాలు గల ఫలాలు, కూల్ డ్రింక్స్ స్థానంలో సహజమైన పండ్ల రసాన్ని ఇచ్చారు. ప్లాస్టిక్ ప్లేట్లకు బదులు బాంబో పీల్ కాగితం, ఆకు డొప్పలు వినియోగించారు. దీపాలు ఆరిపే సంస్కృతికి బదులు దీపాలు వెలిగించి ఆశ్చర్యపరిచారు. ఈ కార్యక్రమానికి హాజరైన పర్యావరణ వేత్త యోగేశ్వర్ మాట్లాడుతూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్, జంక్ ఫుడ్స్ వినియోగంతో పర్యావరణం, ఆరోగ్యానికి జరిగే నష్టాలను వివరించారు. ప్రకృతి మిత్రగా ఆదర్శంగా జరుపుకున్న దంపతులకు పచ్చని మొక్కను కానుకగా అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో గుండేటి సుధీర్, శ్వేత దంపతుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆసక్తిగా హాజరై ఎంతో సంతోషం వ్యక్తం చేసి ప్రశంసలు కురిపించారు.

- మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల, ఆర్. కె న్యూస్: మంత్రి పదవి విషయంలో తనకు అన్యాయం జరిగితే దేనికైనా సిద్ధమేనని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేశారు. సోమవారం మంచిర్యాల బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో మంత్రి పదవి తనకు కాకుండా పార్టీ ఫిరాయింపు వలసవాదులకు ఇస్తే ఉమ్మడి ప్రజల గొంతు కోసినట్లేనని అన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ఆదివాసీలకు, పార్టీ కార్యకర్తలకు అండగా ఉన్న తనకు అన్యాయం చేస్తారా అని అధిష్టానాన్ని ప్రశ్నించారు. మంచిర్యాల పోరాటాల గడ్డ అన్యాయం జరిగితే ఉద్యమిస్తారని అన్నారు. బీజేపీ, బి.ఆర్.ఎస్ పార్టీల చుట్టూ తిరిగిన వారిని అందలం ఎక్కించవద్దని కోరారు.
ఎమ్మెల్సీ విజయశాంతిని మర్యాదపూర్వకంగా కలిసిన సింగరేణి విశ్రాంత ఉద్యోగులు, సినీ నటులు
ఇటీవల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రముఖ సినీ నటి విజయశాంతిని శుక్రవారం సాయంత్రం పలువురు సింగరేణి విశ్రాంత ఉద్యోగులు, సినీ నటులు హైదరాబాద్ లోని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలసి, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ, సింగరేణి కార్మికుల కష్టాలు, త్యాగాలు మరువలేనివి అని, సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. ఎమ్మెల్సీ విజయశాంతిని కలిసిన వారిలో సింగరేణి విశ్రాంత ఉద్యోగులు ఎం.బాబు రావు, ఏ.వేణుమాధవ్, సినీ నటులు, యూట్యూబ్ నిర్మాతలు, నటులు సుచరిత, రత్న శ్రీ హారిక, మహాలక్ష్మి, నిర్మాతలు ఇంద్రకంటి దీప, ఫేమస్ బుల్లెట్ బండి సాంగ్ నిర్మాత నిరుపమ, డబ్బింగ్ అరిస్టు స్రవంతి, ఎస్.బి రెడ్డి క్రియేషన్స్ ఎస్.బి రెడ్డి తదితరులు ఉన్నారు.

- ఆర్.కె 7 గ్రూప్ ఏజెంట్ రాజేందర్
నస్పూర్, ఆర్.కె న్యూస్: మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని ఆర్.కె 7 గ్రూప్ ఏజెంట్ రాజేందర్ అన్నారు. శుక్రవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె 7 గని పై మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఆర్.కె 7 గ్రూప్ ఏజెంట్ రాజేందర్, గని మేనేజర్ జె. తిరుపతి లు మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆర్.కె 7 గ్రూప్ ఏజెంట్ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక ధార్మికుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని, పూలే చేసిన సంఘ సంస్కరణలు నేటి తరానికి ఆదర్శనీయమని, యువ ఉద్యోగులు పూలేను ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని అన్నారు. అనంతరం గని మేనేజర్ జె. తిరుపతి మాట్లాడుతూ, మహాత్మ జ్యోతిరావు పూలే ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకోవాలని ఉద్యోగులకు సూచించారు. ఆర్.కె 7 గని ప్రారంభమై 50 వసంతాలు పూర్తి అవుతున్న నేపథ్యంలో వేడుకల నిర్వహణకు కార్మిక సంఘాల నేతలు, ఉద్యోగులు తమ అభిప్రాయాలు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం ఏరియా వైస్ ప్రెసిడెంట్ కొట్టె కిషన్ రావు, రక్షణ అధికారి సంతోష్ రావు, ఫిట్ ఇంజనీర్ ప్రవీణ్, అండర్ మేనేజర్లు రాము, రవీందర్, సుమ, లక్ష్మి, సంక్షేమ అధికారి సంతన్, ఫిట్ సెక్రటరీ మారేపల్లి సారయ్య, బీసీ నాయకులు పేరం రమేష్, పవన్, వివిధ యూనియన్ ల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- శ్రీరాంపూర్ ఏరియా జీఎం ఎం. శ్రీనివాస్
నస్పూర్, ఆర్. కె న్యూస్: మహాత్మ జ్యోతిరావు పూలే చూపిన మార్గం ఆచరణీయమని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ ఎం. శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం జనరల్ మేనేజర్ కార్యాలయ సమావేశ మందిరంలో డీజీఎం (పర్సనల్) అరవింద రావు అధ్యక్షతన నిర్వహించిన మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలకు ఏరియా జీఎం ఎం. శ్రీనివాస్ హాజరై, పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ మాట్లాడుతూ, మహాత్మ జ్యోతిరావు పూలే సామాజిక న్యాయం, స్త్రీ పురుష సమాన హక్కుల కోసం చేసిన కృషి భారతీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని, తన భార్య సావిత్రీబాయి పూలేకు విద్య నేర్పించి, ఆమెను భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దారని, 1848లో పూలే దంపతులు బాలికల కోసం తొలి పాఠశాల ప్రారంభించడం అప్పటి భారతీయ సమాజంలో సాహసోపేత చర్య అని, మహిళలు, దళితులు విద్య అభ్యసించకూడదు అనే దృక్పథాన్ని ధిక్కరించి, విద్యే విముక్తికి మార్గం అనే సంకల్పంతో పాఠశాలలు స్థాపించారని పేర్కొన్నారు. సింగరేణిలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తూ, ఉద్యోగుల శ్రేయస్సు కోసం చేస్తున్న ప్రయత్నాలకు పూలే ఆశయాలు ప్రేరణ అని అన్నారు. ప్రతి ఒక్కరు మహాత్మ జ్యోతిరావు పూలే చూపిన మార్గాన్ని అనుసరిస్తూ, సమాజంలో అందరిని గౌరవించే దిశగా ముందుకెళ్లాలని, ప్రతిచర్యలో న్యాయానికి, సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిసి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏరియా లైజన్ ఆఫీసర్, ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, అధికారుల సంఘం వైస్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్, ఏరియా ఇంజనీర్ బి. చంద్రశేఖర్ రెడ్డి, డీజీఎం (సివిల్) ఆనంద్ కుమార్, బిసి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ జి. శ్రీనివాస్, బ్రాంచ్ సెక్రటరీ బరుపటి మారుతి, జీఎం కార్యాలయ వివిధ విభాగాల అధిపతులు, ఉద్యోగులు, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- బీసీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఏరియా లైజన్ ఆఫీసర్ ఎన్. సత్యనారాయణ
నస్పూర్, ఆర్.కె న్యూస్: సామాజిక కార్యకర్తగా, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహాత్మ జ్యోతిరావు పూలే జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని బీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏరియా లైజన్ ఆఫీసర్ ఎన్. సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఆర్.కె 6 గని పై నిర్వహించిన మహత్మ జ్యోతిరావు పూలే 198 జయంతి వేడుకలకు గని మేనేజర్ ఈ. తిరుపతితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బి.సి సంఘం ఏరియా లైజన్ ఆఫీసర్ మాట్లాడుతూ, మహత్మ జ్యోతిరావు పూలే భావి తరాలకు సైతం మార్గదర్శకుడని, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేశారని, స్త్రీ విద్య కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త అని, తన భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి మహిళల కోసం మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించారని పేర్కొన్నారు. పూలే ఆశయ సాధనకు కృషి చేయడమే మనం అర్పించే ఘన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్.కె 6 గని అడిషనల్ మేనేజర్ మర్రి కొమురయ్య, గని సంక్షేమాధికారి ఎస్. సురేందర్, వెంటిలేషన్ ఆఫీసర్ ఆర్.రాం నర్సయ్య, గుర్తింపు సంఘం నాయకులు ముష్కె సమ్మయ్య, సంగం సదానందం, బీసీ సంఘం నాయకులు సైదం చిరంజీవి, కారుకూరి నగేష్, వెంగల కుమారస్వామి, బద్రి బుచ్చయ్య, బరుపటి మారుతి, గొర్ల సంతోష్, టి.సురేష్, వేముల సంతోష్, సాయి బాబా, వై. సంపత్ కుమార్, ఎస్సీ,ఎస్టీ యూనియన్ ఏరియా నాయకులు ఏల్పుల ప్రవీణ్, చిలుక రాం చందర్, ఎరోల్ల శంకర్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి, ఆర్.కె న్యూస్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కార్మిక సంఘానికి ఎమ్మార్పీఎస్ నూతన అధ్యక్షుడిగా రాసకొండ శ్రీనివాస్ ను బెల్లంపల్లి మున్సిపల్ కమిటీ పట్టణ అధ్యక్షులు రామగిరి మహేష్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. బెల్లంపల్లి మండల ఇంచార్జ్ జిలకర శంకర్ మాదిగ, ఉపాధ్యక్షులు రమేష్, రాజేశ్వరి, అధికార ప్రతినిధి తోటపల్లి ప్రతాప్, కార్యదర్శి మధునయ్య, సెక్రటరీ శేఖర్, కోశాధికారి రాములు ఈ నూతన కమిటీనీ శాలువాతో సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ముఖ్య నాయకులు చిన్న రాజం, మచ్చ రాజేష్, నాతర శివ ప్రధాన కార్యదర్శి, రత్నం ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.



