శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్
కోల్ మైన్స్ రెగ్యులేషన్స్ 2017, 2026 మార్పులపై అధికారులతో సమీక్ష
నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో గురువారం గనుల భద్రతా నిబంధనలపై సమీక్ష సమావేశం జరిగింది. ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో వివిధ విభాగాల అధిపతులు, గనుల మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు. కోల్ మైన్స్ రెగ్యులేషన్స్ 2017తో పోలిస్తే కొత్తగా వచ్చిన 2026 నిబంధనల్లోని మార్పులపై ప్రధానంగా చర్చించారు. కార్మికుల భద్రత, క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన రక్షణ చర్యల గురించి అధికారులకు జీఎం దిశానిర్దేశం చేశారు. కొత్త రెగ్యులేషన్లలో ప్రవేశపెట్టిన సేఫ్టీ మేనేజ్ మెంట్ సిస్టమ్, రిస్క్ అసెస్మెంట్, మెడికల్ పర్యవేక్షణ, కార్మిక సంక్షేమ సదుపాయాల వంటి అంశాలపై సమావేశంలో స్పష్టత ఇచ్చారు. పాత విధానాలకు, కొత్త నిబంధనలకు మధ్య గల ప్రధాన తేడాలను విశ్లేషించారు. గనుల్లో ప్రతి నిబంధనపై సిబ్బందికి అవగాహన ఉండటం అత్యవసరమని మునిగంటి శ్రీనివాస్ పేర్కొన్నారు. రికార్డుల నిర్వహణ, ఆన్లైన్ రిపోర్టింగ్, ఆరోగ్య పరీక్షలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి గనిలో రోజువారీ అవగాహన తరగతులు నిర్వహించి రక్షణ అంశాలపై ఉద్యోగులకు స్పష్టమైన సూచనలు ఇవ్వాలని చెప్పారు. ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి సిబ్బందికి ఈ రెగ్యులేషన్స్పై ప్రాక్టికల్ అవగాహన కల్పించాలని, అమలులో ఎటువంటి లోపాలు ఉండకూడదని హితవు పలికారు. కొత్త నిబంధనల అమలుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నట్లు సమావేశంలో పాల్గొన్న అధికారులు తెలిపారు. సమావేశంలో ఇంచార్జ్ ఎస్ఓటు జీఎం కుర్మ రాజేందర్, ఏరియా ఇంజినీర్ టీ రమణ రావు, ప్రాజెక్ట్ అధికారులు ఏ. వెంకటేశ్వర రెడ్డి, చిప్ప వెంకటేశ్వర్లు, ఏజెంట్లు శ్రీధర్, జీ రవికుమార్, ఏరియా రక్షణాధికారి విజయ్ కుమార్, ఏరియా సర్వే అధికారి నర్సింగరావు, వివిధ గనుల మేనేజర్లు, గ్రూప్ ఇంజనీర్లు, పిట్ ఇంజనీర్లు, రక్షణాధికారులు తదితరులు పాల్గొన్నారు.







