కాంగ్రెస్లోకి భారీగా చేరికలు.. సింగరేణి వాసులకు పట్టాల పంపిణీకి హామీ
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: మంచిర్యాల నియోజకవర్గంలో గత ఏడు దశాబ్దాలుగా పాలించిన వారు చేయని అభివృద్ధిని తన హయాంలో చేసి చూపిస్తానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ధీమా వ్యక్తం చేశారు. శనివారం పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీకి చెందిన దాదాపు 200 మంది కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖతో కలిసి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా మంచిర్యాలలో త్వరలోనే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. సింగరేణి స్థలాల్లో నివసిస్తున్న కార్మిక కుటుంబాలకు రెండు నెలల కాలంలో శాశ్వత ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని 282 పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో ఆధునీకరించేందుకు 150 కోట్ల రూపాయలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు సాగు, తాగునీరు, మౌలిక సదుపాయాల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారని విమర్శించారు.
ఐబీ చౌరస్తా వద్ద 600 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల్లోని మోదెల, ద్వారక, గుడిరేవు, గూడెం గ్రామాల్లో 74.40 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నాలుగు మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మంచిర్యాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, ప్రతిపక్షాలకు ఓట్లు అడిగే అర్హత లేదని మండిపడ్డారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 60 సీట్లు సాధించి కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలకు ఏ ఆపద వచ్చినా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, యువజన కాంగ్రెస్ ప్రతినిధులు, మహిళా నాయకులు పాల్గొన్నారు.








