- మార్చిలో కొత్తగూడెంలో భారీ ప్రదర్శన
హైదరాబాద్ (పోచారం), ఆర్.కె న్యూస్: సింగరేణి విశ్రాంత ఉద్యోగుల కనీస పెన్షన్ పదివేల రూపాయలకు పెంచాలని, కరువు భత్యంతో కూడిన పెన్షన్ సౌకర్యం కల్పించాలని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పోచారం సర్కిల్ పరిధిలోని కొర్రెముల సుప్రభాత్ టౌన్షిప్లో అసోసియేషన్ అధ్యక్షుడు దండంరాజు రామచందర్ రావు అధ్యక్షతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్ కార్యాచరణపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్ మాట్లాడుతూ.. పెన్షన్ పెంపుదల కోసం గతంలో ఢిల్లీ, వారణాసి, కోల్కతా, కొత్తగూడెంలలో భారీ నిరసనలు చేపట్టినట్లు గుర్తు చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు అన్ని రకాల వైద్య సేవలను ఉచితంగా అందించాలని ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, అధికారులకు వినతులు సమర్పించినట్లు తెలిపారు. సీపీఆర్ఎంఎస్ మెడికల్ కార్డు ఉన్నవారికి, వారి కార్డులో ఉన్న నగదు నిల్వ (బ్యాలెన్స్) వివరాలను ప్రతి నెలా మొబైల్ ఫోన్లకు సందేశాల రూపంలో పంపాలని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా కోల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్చి నెలలో కొత్తగూడెంలో నిర్వహించ తలపెట్టిన భారీ ప్రదర్శనను విజయవంతం చేయాలని సమావేశం తీర్మానించింది. ఈ నిరసనలో సింగరేణి విశ్రాంత ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం, గత నెలలో జరిగిన జనరల్ బాడీ సమావేశానికి భోజన ఏర్పాట్లు చేసిన సామంతల నర్సింగ్ రావును కార్యవర్గ సభ్యులు అభినందించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు ఎం. విజయ బాబు, కె. బీరయ్య, ఎస్. నర్సింగ్ రావు, టి. ఉమాకర్, పార్థసారథి, జయంత్ కుమార్, ఎం. రాజనర్సు, చుక్కల నర్సయ్య, లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు. ముఖ్య సలహాదారు టి. ఉమాకర్ కృతజ్ఞతలు తెలిపారు.







