ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నోడల్ అధికారి అంబటి శ్రీనివాస్ గౌడ్
ఐజా ఇంజినీరింగ్ కళాశాలలో శిక్షణ తరగతుల పరిశీలన
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: గ్రామ పరిపాలనలో నూతన సర్పంచులు పట్టు సాధించాలని, పంచాయతీ రాజ్ చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నోడల్ అధికారి అంబటి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. ముల్కల్లలోని ఐజా ఇంజినీరింగ్ కళాశాల వేదికగా జిల్లా స్థాయి నూతన సర్పంచులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను జిల్లా పంచాయతీ అధికారి డి. వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా శిక్షణ కోసం ఏర్పాటు చేసిన తరగతి గదులు, పురుషులు, మహిళలకు వేర్వేరుగా కల్పించిన వసతి సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులను అభినందించారు.
శిక్షణలో ఉన్న సర్పంచులను ఉద్దేశించి అంబటి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. గ్రామాల్లో పారదర్శకమైన పాలన అందించేందుకు ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. సుశిక్షితులైన మాస్టర్ ట్రైనర్ల ద్వారా చట్టపరమైన అంశాలను, నిధులను వెచ్చించే విధానాలను అడిగి తెలుసుకోవాలని కోరారు. అనంతరం జిల్లా పంచాయతీ అధికారి డి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. శిక్షణకు హాజరయ్యే వారు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని, ప్రతి అంశాన్ని శ్రద్ధగా నేర్చుకుని క్షేత్రస్థాయిలో అమలు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు మోహన్, సాయి వెంకట్ రెడ్డి, మండల పంచాయతీ అధికారులు శ్రీపతి బాపు రావు, వేదాల శ్రీనివాస్, సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు మాస్టర్ ట్రైనర్లు అనిల్ కుమార్, వెంకటేష్, మహేష్, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, ఉమ్మడి జిల్లా ట్రైనింగ్ మేనేజర్ శారద, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ నరేందర్, జిల్లా పంచాయతీ కార్యాలయ సిబ్బంది హాజరయ్యారు.







