- శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్
- సింగరేణి ఉన్నత పాఠశాల 48వ వార్షికోత్సవం
నస్పూర్, ఆర్.కె న్యూస్: గత 48 ఏళ్లుగా సిసిసి నస్పూర్ సింగరేణి పాఠశాలలో చదివిన ఎంతో మంది విద్యార్థులు నేడు ఉన్నత స్థితికి చేరుకున్నారని, వారిని ఆదర్శంగా తీసుకుని ప్రస్తుత విద్యార్థులు ఇష్టపడి చదివి మంచి మార్కులతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సింగరేణి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ పేర్కొన్నారు. సిసిసి నస్పూర్ లోని సింగరేణి ఉన్నత పాఠశాల 48వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం సాయంత్రం వైభవంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన మునిగంటి శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి పాఠశాల కీర్తిని దశదిశలా చాటాలని పిలుపునిచ్చారు. పదవ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఈ వేదికపై ప్రత్యేకంగా అభినందించారు. 2024-2025 విద్యాసంవత్సరంలో 540 మార్కులు సాధించిన నాహేద బేగంకు 2000 రూపాయల నగదు బహుమతి అందజేశారు. అలాగే 525 మార్కులు సాధించిన అమూల్యకు 1000 రూపాయల నగదు పురస్కారాన్ని జనరల్ మేనేజర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. విద్యార్థుల్లోని ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇటువంటి బహుమతులు దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం ఎన్. సత్యనారాయణ, పాఠశాల కరస్పాండెంట్ ఎం. రాజేష్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.








