బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్
శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ఎదుట బీజేపీ భారీ ధర్నా
నస్పూర్, ఆర్.కె న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థను ఏటీఎంగా వాడుకుంటూ, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులు కట్టబెడుతూ సంస్థను దోచుకుంటోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ ఆరోపించారు. గురువారం శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ఎదుట బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించిన అనంతరం ఏరియా ఎస్ఓటు జీఎం ఎన్. సత్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. అంతకుముందు నాయకులు ఆర్.కే 5 కాలనీలోని సింగరేణి క్వార్టర్లను పరిశీలించి, కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెరబెల్లి రఘునాథ్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. క్వార్టర్ల మరమ్మతులు చేపట్టాలని, సింగరేణి స్థలాల్లో నివసిస్తున్న వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, రిటైర్డ్ కార్మికులకు రెండు గుంటల భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు. సింగరేణి నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లిస్తోందని, కార్మికుల మౌలిక వసతులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించనందుకు నిరసనగా జిల్లాకు వస్తున్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటనను అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలగందుల కృష్ణమూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు పి. కమలాకర్ రావు, జిల్లా సోషల్ మీడియా ఇంచార్జి జయరాం, జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి మొగిలి, జిల్లా కౌన్సిల్ సభ్యులు వీర్ల సదానందం, సామ్రాజ రమేష్, మాలోత్ జ్యోతి, శ్రీరాంపూర్, నస్పూర్ జోన్ అధ్యక్షులు సత్రం రమేష్, కుర్ర చక్రవర్తి, నాయకులు కొనవేని సదయ్య, భద్ర శ్రీకాంత్, మద్ది సుమన్, బోర్ల చిరంజీవి, జీవి ఆనంద్ కృష్ణ, పానుగంటి మధు, పాషా, నాయకులు తదితరులు పాల్గొన్నారు.









