పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి.. రేపు నగరంలో స్పెషల్ డ్రైవ్
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల నగర పాలక సంస్థ అభివృద్దే మన ప్రధాన ధ్యేయమని మేయర్ ధర్ని మధుకర్ పేర్కొన్నారు. మంచిర్యాల నగర పాలక సంస్థ పరిధిలోని 10, 30, 32వ డివిజన్లలో బుధవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. పారిశుద్ధ్య పనులు, రహదారుల నిర్మాణ ప్రగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ కమిషనర్ అన్వేష్, స్థానిక కార్పొరేటర్లతో కలిసి వార్డుల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నగర సుందరీకరణ, ప్రజల సౌకర్యార్థం చేపట్టే పనుల్లో నిర్లక్ష్యం వహించకూడదని అధికారులకు స్పష్టం చేశారు. పర్యటనలో భాగంగా డివిజన్ల వారీగా పారిశుద్ధ్య పరిస్థితులను మేయర్ సమీక్షించారు. డ్రైనేజీల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. గురువారం నగరం అంతటా ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించి మురుగు కాల్వలను శుభ్రం చేయాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. రహదారుల నిర్మాణ పనుల వివరాలను కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. పనులు నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పాలక వర్గం పనిచేస్తుందని వెల్లడించారు. ప్రజల నుంచి అందిన వినతులపై సానుకూలంగా స్పందించిన మేయర్, క్షేత్రస్థాయిలో పనుల పర్యవేక్షణ నిరంతరం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 10వ డివిజన్ కార్పొరేటర్ రాచకొండ గోపాల్ రావు, 30వ డివిజన్ కార్పొరేటర్ కర్రె శ్రీనివాస్, నగర పాలక సిబ్బంది, ఆయా వార్డుల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








