🟤 ఐఎన్టీయూసీ సీనియర్ కేంద్ర ఉపాధ్యక్షుడు జెట్టి శంకర్ రావు
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఓపెన్ కాస్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న కనీస వసతుల సమస్యలను యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని ఐఎన్టీయూసీ సీనియర్ కేంద్ర ఉపాధ్యక్షుడు జెట్టి శంకర్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ బి.జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు సోమవారం శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్లో ఐఎన్టీయూసీ నాయకులు పర్యటించారు. అక్కడ పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలను నాయకులు నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఓపెన్ కాస్ట్ ఫిట్ కార్యదర్శి ఓరం జగన్ నేతృత్వంలో నిర్వహించిన గేట్ మీటింగ్లో శంకర్ రావు మాట్లాడారు. సీహెచ్పీ, ఎలక్ట్రికల్, మెకానికల్ సెక్షన్లలో పని చేస్తున్న ఉద్యోగులకు సరైన రెస్ట్ షెల్టర్లు లేవని ఆయన వివరించారు. కార్మికులు తమ సామాన్లు భద్రపరుచుకునే గదులు, తాగునీరు, వాష్ రూమ్ వసతులు కల్పించాలని కోరారు. ఓపెన్ కాస్ట్ ప్రాంగణంలో సెక్షన్లు దూరంగా ఉన్నందున ప్రతి విభాగం వద్ద మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. వాహనాలు, మోటార్ మెకానిక్ విభాగాల్లో మరమ్మతుల కోసం అవసరమైన స్పేర్ పార్ట్స్ తక్షణమే సరఫరా చేయాలి. సెలవు దినాల్లో పని చేసే మంత్లీ రేట్ ఉద్యోగుల వీక్లీ రెస్ట్ నిబంధనలను సడలించాలి. గతంలో ఉన్నట్లుగా మూడు నెలల కాలంలో ఎప్పుడైనా వీక్లీ రెస్ట్ తీసుకునే వెసులుబాటు కల్పించాలని యాజమాన్యాన్ని కోరారు. ఈ సమస్యలపై నాయకులు ప్రాజెక్ట్ ఆఫీసర్ సీహెచ్ వెంకటేశ్వర్లును కలిసి విన్నవించారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి త్వరలోనే పరిష్కార చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ కేంద్ర నాయకులు సీహెచ్ భీమ్ రావు, కలవేణి శ్యామ్, గరిగ స్వామి, తిరుపతి రాజు, ఏనుగు రవీందర్ రెడ్డి, జీవన్ జోయల్, ల్యాగల శ్రీనివాస్, శీలం చిన్నయ్య, ఓపెన్ కాస్ట్ నాయకులు జాన్సన్, రమేష్, అంకుస్, కందుల శంకరయ్య, బెల్లం తిరుపతి పాల్గొన్నారు.








