మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
60 డివిజన్లలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాలను అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలుపుతానని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. నస్పూర్ పట్టణంలో గురువారం నిర్వహించిన ఎన్నికల సభలో ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ తో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, మంచిర్యాల కార్పొరేషన్ లోని 60 డివిజన్లను గెలిచి కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి చివరి శ్వాస వరకు పాటుపడతానని పేర్కొన్నారు. నస్పూర్ పట్టణాన్ని జిల్లా కేంద్రానికి సమానంగా తీర్చిదిద్దుతామని ప్రేమ్ సాగర్ రావు చెప్పారు. సింగరేణి స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి పట్టాలు అందజేస్తామన్నారు. లక్ష్మీ టాకీస్ నుంచి నస్పూర్ మీదుగా కొత్త రోడ్డు వరకు బైపాస్ నిర్మిస్తామని వెల్లడించారు. స్థానిక యువతకు ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. అనారోగ్యంతో ఉన్నా ప్రజల కోసం పని చేస్తున్నట్లు వివరించారు. రిటైర్డ్ సింగరేణి కార్మికులకు రేషన్ కార్డులు మంజూరు చేయించామని గుర్తు చేశారు. కరకట్ట, ఆసుపత్రి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
ఏఐసిసి సెక్రెటరీ సచిన్ సావంత్ మాట్లాడుతూ గత రెండేళ్ల కాంగ్రెస్ పాలన చూసి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 60 స్థానాల్లో విజయం సాధించి మంచిర్యాల కాంగ్రెస్ అడ్డా అని నిరూపించాలని పిలుపునిచ్చారు. సభకు వచ్చిన ప్రజా స్పందన చూస్తుంటే విజయం ఖాయమనిపిస్తోందని అన్నారు. బిజెపి, బిఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మవద్దని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను విక్రయిస్తోందని ఆరోపించారు. అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాల వల్ల భారత రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హస్తం రైతులు, సామాన్యులకు రక్షణ కవచమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ఐఎన్టీయూసీ నాయకుడు జెట్టి శంకర్ రావు, కార్పొరేటర్ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.









