మంచిర్యాల లక్ష్మీనగర్ కాలనీలో నివాళులర్పించిన నాయకులు
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 28వ వార్డు లక్ష్మీనగర్ కాలనీలో శనివారం సావిత్రీబాయి పూలే 195వ జయంతిని ఘనంగా నిర్వహించారు. భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు, గొప్ప సంఘ సంస్కర్త అయిన సావిత్రీబాయి చిత్రపటానికి కాలనీ వాసులు, నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. అజ్ఞానంలో ఉన్న సమాజంలో జ్ఞానదీపాన్ని వెలిగించిన మహనీయురాలు సావిత్రీబాయి అని కొనియాడారు. ఆమె జయంతిని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. స్త్రీల హక్కుల సాధన కోసం, అణగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం ఆమె చేసిన త్యాగాలు మరువలేనివని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంఘాల నాయకుడు గజెల్లి వెంకటయ్య, రాజిరెడ్డి, రాజేశం, లక్ష్మణ్, బాబు, ఎల్లయ్య, శ్రీనివాస రెడ్డి, సత్యనారాయణ, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.







