నస్పూర్, ఆర్.కె న్యూస్: పట్టణంలోని రామ్ నగర్లో తెలంగాణ గ్రామీణ బ్యాంకు (సీతారాంపల్లి శాఖ) ఆధ్వర్యంలో శనివారం ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ నరసింహ స్వామి ఖాతాదారులకు పలు ప్రభుత్వ బీమా పథకాలు, డిజిటల్ లావాదేవీల భద్రతపై అవగాహన కల్పించారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకంలో 18-70 ఏళ్ల వారు ఏడాదికి రూ.20 చెల్లిస్తే, ప్రమాదవశాత్తు మరణించినా లేదా అంగవైకల్యం సంభవించినా రూ.2 లక్షల బీమా అందుతుందని, జీవనజ్యోతి బీమా యోజన పథకంలో 18-50 ఏళ్ల వారు ఏడాదికి రూ.436 చెల్లించడం ద్వారా రూ. 2 లక్షల జీవిత బీమా లభిస్తుందని, అటల్ పెన్షన్ యోజన పథకంలో 18-40 ఏళ్ల లోపు వారు చేరితే, 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.1000 నుండి రూ.5000 వరకు పెన్షన్ పొందవచ్చని, చందాదారుడి మరణానంతరం భార్యకు, ఆ తర్వాత పిల్లలకు కూడా ఆర్థిక వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు. బ్యాంకు ఏటీఎం కార్డు కలిగి ఉన్నవారికి ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.2 లక్షల వరకు బీమా సౌకర్యం ఉంటుందని తెలిపారు. డిజిటల్ లావాదేవీలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఎవరికీ పాస్వర్డ్లు, ఓటీపీలు చెప్పకూడదని మేనేజర్ సూచించారు. అపరిచిత ఫోన్ కాల్స్, అనుమానాస్పద లింకులను నమ్మవద్దని కోరారు. అనంతరం రమేష్ కల్చరల్ అసోసియేషన్ కళాకారులు పాటలు, మ్యాజిక్ షో ద్వారా బ్యాంకింగ్ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి, సుధ, పరిమళ, సునీత, అంజయ్య, సత్తన్న, ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు.
76







