- శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్
- భారీ వాహనాల డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న ముగ్గురు మహిళా ఉద్యోగులకు సర్టిఫికెట్ల అందజేత
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి సంస్థ కల్పిస్తున్న వృత్తి శిక్షణ అవకాశాలను మహిళా ఉద్యోగులు సద్వినియోగం చేసుకుని గౌరవప్రదమైన హోదాతో పాటు ఉన్నత వేతనాలు పొందే దిశగా ఎదగాలని శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ ఆకాంక్షించారు. సోమవారం శ్రీరాంపూర్ ఏరియా నుంచి విజయవంతంగా హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న ముగ్గురు మహిళా ఉద్యోగులకు జీఎం కార్యాలయంలో ఆయన సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. లా విభాగంలో పనిచేస్తున్న నవ్య, ఎస్ అండ్ పీసీ విభాగం నుంచి ప్రియాంక, సీహెచ్పీ నుంచి త్రివేణి ఈ ప్రత్యేక శిక్షణను పూర్తి చేసుకున్నారు. మహిళా ఉద్యోగుల సేవలను అన్ని విభాగాల్లో విస్తృతం చేసే ఉద్దేశంతో సంస్థ వీరికి భారీ వాహనాల డ్రైవింగ్లో శిక్షణ కల్పించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని టైడ్స్ సంస్థలో 30 రోజుల పాటు నిపుణుల సమక్షంలో భారీ వాహనాల డ్రైవింగ్, నిర్వహణ మెళుకువలపై వీరు శిక్షణ పొందారు. సింగరేణి వ్యాప్తంగా ఎంపిక చేసిన 13 మందిలో శ్రీరాంపూర్ నుంచి ముగ్గురు మహిళలు ఈ ఘనత సాధించడం అభినందనీయమని జీఎం కొనియాడారు. మిగిలిన ఉద్యోగులు కూడా వీరిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ శిక్షణ పూర్తి చేసుకున్న వారు త్వరలోనే హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ పొంది, సింగరేణిలో డంపర్ ఆపరేటర్లు లేదా ఇతర భారీ వాహన చోదకులుగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం పెరగడం సంస్థ అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం ఎన్. సత్యనారాయణ, ఆర్.కె 7 గ్రూప్ ఏజెంట్ కె. రాజేందర్, డీజీఎం అనిల్ కుమార్ పాల్గొన్నారు.



