- కుటుంబసమేతంగా తరలివచ్చిన పర్యాటకులు
- మౌలిక వసతులు కల్పించాలని సందర్శకుల విజ్ఞప్తి
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలోని జలపాతాలు జలకళను సంతరించుకున్నాయి. మంచిర్యాల జిల్లా కేంద్రానికి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న గత్రపల్లె జలపాతానికి సోమవారం పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వరద నీటితో పాల నురగలా జాలువారుతున్న జలపాతం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పాఠశాలలకు వరుసగా సెలవులు రావడంతో పలువురు కుటుంబ సభ్యులతో కలిసి జలపాతాన్ని సందర్శించి ప్రవాహాన్ని చూసి పరవశించిపోయారు. యువత, చిన్నారులు జలపాతం వద్ద స్నానాలు చేస్తూ ప్రకృతి రమణీయతను ఆస్వాదించారు. పలువురు బంధుమిత్రులతో కలిసి సమీపంలో సహపంక్తి భోజనాలు చేసి, ఆటపాటలతో సరదాగా గడిపారు. జలధారలను కెమెరాల్లో బంధిస్తూ సెల్ఫీలు దిగి ఆనందం వ్యక్తం చేశారు. కాగా, గత్రపల్లె జలపాతానికి వెళ్లడానికి సరైన రహదారి లేకపోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జలపాతానికి వెళ్లే మార్గాన్ని నిర్మించడంతో పాటు అక్కడ తాగునీరు, ఇతర మౌలిక వసతులు కల్పించి మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని సందర్శకులు కోరుతున్నారు.



