ముక్కిడి పోచమ్మ ఆలయ పరిసరాల్లో డ్రోన్ నిఘా
నస్పూర్, ఆర్.కె న్యూస్: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని, రోడ్ల పక్కన, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ పట్టుబడితే ఎవరినీ ఉపేక్షించేది లేదని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీసీసీ నస్పూర్ ఎస్సై మేకల ప్రశాంత్ హెచ్చరించారు. సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముక్కిడి పోచమ్మ ఆలయ సమీపంలో గురువారం సాయంత్రం పోలీసులు డ్రోన్ కెమెరాల సాయంతో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. మంచిర్యాల రూరల్ సీఐ గోపతి రవీందర్ ఆధ్వర్యంలో, సీసీసీ నస్పూర్ ఎస్సై మేకల ప్రశాంత్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం కొనసాగింది. డ్రోన్ ఆపరేటర్ల సహాయంతో ముక్కిడి పోచమ్మ గుడి పరిసర ప్రాంతాలు, జాతీయ రహదారి వెంబడి ఉన్న ఖాళీ స్థలాలపై ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీలు నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ కోసమే ఆధునిక సాంకేతికతతో డ్రోన్ నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.







