- ఈనెల 13న హైదరాబాద్లో జరిగే సదస్సును జయప్రదం చేయాలని పిలుపు
- ఆటో డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో ఈనెల 23వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని మంచిర్యాల జిల్లా ఆటో యూనియన్ జేఏసీ నాయకులు హెచ్చరించారు. మంగళవారం నస్పూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు. ఆటో డ్రైవర్ల సమస్యలపై ఈ నెల 13న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన భవన్లో జరిగే రాష్ట్ర స్థాయి సదస్సును విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని నాయకులు విమర్శించారు. ఎన్నికల హామీ మేరకు ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, ఏటా రూ. 12 వేల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆటో భవన్ నిర్మాణంతో పాటు రూ. 1000 కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. మహాలక్ష్మి పథకం ప్రభావంతో ఆటో డ్రైవర్ల ఆదాయం తగ్గి ఫైనాన్స్ కిస్తీలు, ఇంటి అద్దెలు చెల్లించలేక కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న 200 పైచిలుకు ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని కోరారు. కొత్త త్రీ వీలర్ లైసెన్సుల జారీ నిలుపుదల చేయడం, ఆర్టీసీలో ఎలక్ట్రిక్ ఆటోలను ప్రవేశపెట్టాలనే ఆలోచనను విరమించుకోవాలని నాయకులు స్పష్టం చేశారు. ఆర్టీసీలో అద్దె బస్సుల మాదిరిగానే అద్దె ఆటోలకు అవకాశం కల్పించి ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఈ నెల 17న జిల్లా కలెక్టర్కు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ జేఏసీ నాయకులు పొట్ట మధుకర్, చెల్ల విక్రమ్, సుద్దాల రాజు, కట్ట రామ్ కుమార్, తగరం శ్రీనివాస్, ఎండీ హబీబ్ తదితరులు పాల్గొన్నారు.



