శ్రీరాంపూర్ పాఠశాలలో నూతన కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించిన మేయర్ ధర్ని మధుకర్
నస్పూర్, ఆర్.కె న్యూస్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు కంప్యూటర్ విద్య ఎంతో అవసరమని, చిన్నతనం నుంచే సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవడం ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ తెలిపారు. శ్రీరాంపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ ధర్ని మధుకర్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, ఆధునిక సాంకేతిక సదుపాయాలు కల్పిస్తూ నాణ్యమైన విద్యను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించడంతో పాటు విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో భాగంగా మేయర్ చేతుల మీదుగా పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటగా, విద్యార్థులకు ఉచితంగా షూలు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన విద్య, సాంకేతిక సదుపాయాలు అందుబాటులోకి రావడం వల్ల తల్లిదండ్రుల్లో నమ్మకం పెరుగుతుందని, ఇది విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వేల్పుల రవీందర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.




