- శ్రీరాంపూర్ 6వ డివిజన్లో ఉచిత వైద్య శిబిరం
- నిర్మల పాలిక్లినిక్, శ్రీ వాసుదేవాయ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు, మందుల పంపిణీ
నస్పూర్, ఆర్.కె న్యూస్: ముందస్తు పరీక్షలు, క్రమం తప్పని ఆరోగ్య పరిరక్షణ ద్వారా అనేక దీర్ఘకాలిక వ్యాధులను ప్రాథమిక దశలోనే నివారించవచ్చని వైద్య నిపుణులు డాక్టర్ జి. శ్రీకాంత్, డాక్టర్ కుసుమ నిర్మల పేర్కొన్నారు. శ్రీ వాసుదేవాయ హెల్త్ కేర్ ట్రస్ట్ సౌజన్యంతో నిర్మల పాలిక్లినిక్ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ కాలనీలోని 6వ డివిజన్లో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక 6వ డివిజన్ కార్పొరేటర్ వనపర్తి కేతా రాజేష్, దాత గుత్తికొండ ప్రశాంత్ ప్రత్యేక సహకారం అందించారు. శిబిరంలో స్థానిక ప్రజలకు జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్ వైద్య సేవలతో పాటు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. నిపుణులైన వైద్యులు డాక్టర్ జి. శ్రీకాంత్, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కుసుమ నిర్మల రోగులను స్వయంగా పరీక్షించి కుటుంబ ఆరోగ్య సలహాలు అందించారు. పరీక్షలు చేయించుకున్న వారికి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల స్పృహ కలిగి ఉండాలని సూచించారు. ఈ వైద్య శిబిరానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన స్థానికులు వైద్య పరీక్షలు చేయించుకుని సేవలను వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో 5వ డివిజన్ కార్పొరేటర్ తోటపల్లి రాజేశ్వరి, నాయకులు ప్రణయ్, ముక్కెర శ్రీనివాస్, బొజ్జ భూమన్న, శ్రీనివాస్, సంపత్, సాగర్, శ్యామ్, కాలనీ ప్రముఖులు పాల్గొన్నారు.




