- ఆర్.కె న్యూ టెక్ గని మేనేజర్కు హెచ్ఎంఎస్, తెలంగాణ జాగృతి వినతి
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి వ్యాప్తంగా గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాల కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో, అన్ని రిజిస్టర్డ్ సంఘాలకు సమాన హోదా కల్పించాలని హెచ్ఎంఎస్, తెలంగాణ జాగృతి నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె న్యూ టెక్ గని మేనేజర్ కూరపాటి శ్రీనివాస్ కు ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ నాయకులు తులా అనిల్ కుమార్ మాట్లాడుతూ, 2023 డిసెంబర్ 27న జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల గడువు 2025 డిసెంబర్ 27తో ముగిసిందని గుర్తుచేశారు. సెంట్రల్ లేబర్ కమిషనర్ ఆదేశాల ప్రకారం గుర్తింపు సంఘం కాలపరిమితి రెండేళ్లు మాత్రమేనని, ఆ గడువు ముగిసిన వెంటనే ప్రస్తుత హోదా రద్దవుతుందని స్పష్టం చేశారు. కొత్త ఎన్నికలు నిర్వహించే వరకు అన్ని రిజిస్టర్డ్ కార్మిక సంఘాలను సమానంగా చూడాలని, మైన్స్ కమిటీ, పిట్ సేఫ్టీ కమిటీ సమావేశాలకు అన్ని సంఘాల ప్రతినిధులను ఆహ్వానించాలని, కార్మికుల సమస్యలపై నిర్వహించే అన్ని అధికారిక చర్చల్లో అన్ని సంఘాలకు భాగస్వామ్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ నాయకులు సురేందర్, అనిల్ అడ్లూరి, సంపత్, తెలంగాణ జాగృతి నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.







