- ఖమ్మం శత జయంతి ఉత్సవాల కవాతును విజయవంతం చేయాలని నేతల పిలుపు
నస్పూర్, ఆర్.కె న్యూస్: భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జిల్లా సమితి ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో జిల్లా స్థాయి జనసేవాదళ్ శిక్షణ శిబిరం సోమవారం నిర్వహించారు. పార్టీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 18న ఖమ్మంలో జరగనున్న భారీ బహిరంగ సభ, పదివేల మంది కార్యకర్తలతో నిర్వహించే కవాతును విజయవంతం చేయడమే లక్ష్యంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర జనసేవాదళ్ శిక్షకులు గోశిక మోహన్తో కలిసి ఆయన శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలవేన శంకర్ మాట్లాడుతూ.. 1964లో చండ్రా రాజేశ్వరరావు జాతీయ కార్యదర్శిగా ఉన్న సమయంలో విపత్కర పరిస్థితుల నుంచి ప్రజలను ఆదుకోవడానికి, పార్టీ నాయకులకు రక్షణ కల్పించడానికి జనసేవాదళ్ను స్థాపించినట్లు గుర్తుచేశారు. ఆనాటి స్ఫూర్తితోనే నేడు కార్యకర్తలు ప్రజాసేవకు పునరంకితం కావాలని కోరారు.
ఖమ్మంలో జరగబోయే చారిత్రాత్మక బహిరంగ సభలో జనసేవాదళ్ కార్యకర్తల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో పార్టీ అనుబంధ సంఘాలు, ప్రజా సంఘాలు జనసేవాదళ్ను మరింత బలోపేతం చేస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల దాసు, జోగుల మల్లయ్య, రేగుంట చంద్రశేఖర్, కె. వీరభద్రయ్య, దాగం మల్లేష్, కలిందర్ అలీ ఖాన్, చిప్ప నరసయ్య, ఇప్పకాయల లింగయ్య పాల్గొన్నారు. అలాగే ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు కొంకుల రాజేష్, లింగం రవి, డిహెచ్పిఎస్ నాయకులు దేవి పోచన్న సహా పలువురు కార్యకర్తలు హాజరయ్యారు.







