- జన్నారం ఎస్సై గొల్లపల్లి అనూష, భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పులేటి నరేష్ పిలుపు
జన్నారం, ఆర్.కె న్యూస్: శాస్త్ర విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందిన ప్రస్తుత సైన్స్ యుగంలో ఇంకా మూఢనమ్మకాలను నమ్మడం దురదృష్టకరమని జన్నారం ఎస్సై గొల్లపల్లి అనూష, భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పులేటి నరేష్ అన్నారు. సోమవారం జన్నారం మండలంలోని ధర్మారం గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘మూఢనమ్మకాలపై అవగాహన సదస్సు’ నిర్వహించారు. పోలీస్ కళాబృందం, భారత నాస్తిక సమాజం సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలకు చేతబడి, బాణామతి వంటి అంశాలపై ఉన్న అపోహలను తొలగించారు.
ఈ సందర్భంగా ఎస్సై అనూష మాట్లాడుతూ.. పిల్లలను ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులను చేయాలని, మంత్రాలు, తాయెత్తుల పేరుతో కాలం వృథా చేయవద్దని కోరారు. కొంతమంది దొంగ స్వాములు, భూతవైద్యులు అమాయక ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని చేతబడి, బాణామతి నెపంతో డబ్బులు వసూలు చేస్తూ మోసగిస్తున్నారని హెచ్చరించారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పులేటి నరేష్ ఈ సందర్భంగా పలు ఇంద్రజాల ప్రదర్శనలు నిర్వహించి ప్రజలను ఆశ్చర్యపరిచారు. నోట్లో మంటలు లేపడం, పచ్చి వేపాకులపై నీళ్లు చల్లగానే మంటలు రావడం, ఇనుప చువ్వను నాలుకకు గుచ్చుకోవడం, ఇసుకలో నుండి నాణేలు తీయడం వంటి విన్యాసాల వెనుక ఉన్న అసలు రహస్యాలను ఆయన శాస్త్రీయంగా వివరించారు. ఇవన్నీ కేవలం చేతివాటం, రసాయనాల వాడకం వల్ల జరిగే ప్రక్రియలే తప్ప, ఇందులో ఎలాంటి మంత్రశక్తి లేదని నిరూపించారు.
ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన సర్పంచ్, ఉపసర్పంచ్, ఏఎస్ఐ, పోలీస్ కళాబృందం సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోలీస్ కళాబృందం వారు తమ పాటలు, ఆటలతో మూఢనమ్మకాల వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో చైతన్యం నింపారు.







