- హక్కుల సాధనకు కృషి చేస్తామని యాదగిరి సత్తయ్య వెల్లడి
నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో మంగళవారం ఏరియా ఉపాధ్యక్షుడు నాతాడి శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వివిధ యూనియన్ల నుంచి పలువురు సెక్యూరిటీ విభాగం ఉద్యోగులు బిఎంఎస్లో చేరారు. సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్-బిఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య ముఖ్య అతిథిగా హాజరై కార్మికులకు కండువాలు కప్పి ఆహ్వానించారు. సింగరేణి సంస్థ ఆస్తులను కంటికి రెప్పలా కాపాడుతున్న సెక్యూరిటీ ఉద్యోగులు సైనికులతో సమానమని ఆయన కొనియాడారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న సెక్యూరిటీ విభాగం డెసిగ్నేషన్ మార్పు కోసం తమ సంఘం గట్టిగా కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.
కార్మికులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చేలా కొత్త క్యాడర్ స్కీమ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన ఉద్యోగులకు సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్లుగా పదోన్నతులు కల్పించే అంశాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తామన్నారు. సింగరేణి విస్తరణకు ఆరు జిల్లాల్లో అపారమైన బొగ్గు నిల్వలు ఉన్నాయని, నూతన గనుల అన్వేషణ ద్వారానే సంస్థ పురోగతి సాధ్యమని పేర్కొన్నారు. సింగరేణిని నిర్వీర్యం చేసే కుట్రలను కార్మికులు సమైక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్మిక సంక్షేమం, సామాజిక భద్రత కోసం బిఎంఎస్ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి రాగం రాజేందర్, పిట్ కార్యదర్శి కొమ్మ బాపు, జాయింట్ సెక్రెటరీలు బోయిన మల్లేష్, కట్టుకూరి సతీష్, రాజారాం కిరణ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ జల్ల తిరుపతి, బుర్ర అరుణ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.







