యాజమాన్యం తీరుపై అనిల్ రెడ్డి ధ్వజం
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి యాజమాన్యం అనుసరిస్తున్న అహేతుక బదిలీల వల్ల శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ఈపీ ఆపరేటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హెచ్ఎంఎస్ శ్రీరాంపూర్ ఉపాధ్యక్షుడు వంటకాల అనిల్ రెడ్డి విమర్శించారు. శనివారం శ్రీరాంపూర్లో విడుదల చేసిన ప్రకటనలో ఆయన డిప్యూటేషన్ల ప్రక్రియను తప్పుబట్టారు. శ్రీరాంపూర్ ఓసీపీ నుండి ఈపీ ఆపరేటర్లను ఇందారం ఓసీపీకి పంపిస్తూనే, ఆర్జీ-2 ఏరియా ఈపీ ఆపరేటర్లను శ్రీరాంపూర్ రావాలని కోరుతూ సర్క్యులర్ జారీ చేయడం యాజమాన్యం ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు. ఆర్జీ-2 ఏరియా వారిని నేరుగా ఇందారం ఓసీపీకి పంపే అవకాశం ఉన్నా, శ్రీరాంపూర్ కార్మికులను కావాలనే వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ శ్రీరాంపూర్, ఇందారం నుండి 18 మందిని మణుగూరుకు పంపించి కార్మికుల కుటుంబాల్లో గందరగోళం సృష్టించారని గుర్తుచేశారు. సంస్థలో పైరవీకారుల జోక్యం పెరిగిందని, రికమండేషన్లు ఉన్న వారిని శ్రీరాంపూర్లోనే ఉంచుతూ సామాన్య కార్మికులను ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదన్నారు. ఎటువంటి ప్రణాళిక లేకుండా చేపడుతున్న ఈ బదిలీల వల్ల కార్మికులు మానసిక, శారీరక ఒత్తిడికి లోనవుతున్నారని పేర్కొన్నారు. యాజమాన్యం తన మొండి వైఖరిని వీడి కార్మికుల సమస్యలపై తక్షణమే స్పందించాలని అనిల్ రెడ్డి డిమాండ్ చేశారు.








