శ్రీరాంపూర్ డీజీఎం (పర్సనల్) అనిల్ కుమార్
మనోరంజన్ సముదాయ్లో వృత్తి శిక్షణ తరగతుల పరిశీలన
నస్పూర్, ఆర్.కె న్యూస్: మహిళలు వివిధ రకాల వృత్తి శిక్షణ కోర్సుల ద్వారా ఆర్థిక స్వాలంబన సాధించి ఇతరులకు మార్గదర్శకులుగా నిలవాలని శ్రీరాంపూర్ డీజీఎం (పర్సనల్) అనిల్ కుమార్ అన్నారు. బుధవారం నస్పూర్ కాలనీలోని మనోరంజన్ సముదాయ్లో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టైలరింగ్, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్ తరగతులను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. శ్రీరాంపూర్ ఏరియాలో సుమారు 555 మంది మహిళలు వివిధ రకాల వృత్తి శిక్షణ కోర్సులను నేర్చుకుంటున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. శిక్షణ పొందుతున్న మహిళలు తరగతులకు విధిగా హాజరు కావాలని అనిల్ కుమార్ సూచించారు. ఫ్యాకల్టీ వద్ద ఉన్న నైపుణ్యాలను నేర్చుకుని స్వయం ఉపాధి వైపు ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలి. సమాజంలో ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలు భవిష్యత్తులో ఆర్థిక ఎదుగుదలకు తోడ్పడతాయని తెలిపారు. శిక్షణ కేంద్రంలోని హాజరు రిజిస్టర్లను అనిల్ కుమార్ తనిఖీ చేశారు. మహిళల హాజరు శాతం, వారి పురోగతి వివరాలను శిక్షకులను అడిగి తెలుసుకున్నారు. శిక్షణార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సేవా సమితి అధికారి, సీనియర్ పీవో సురేందర్ పాల్గొన్నారు.







