మంచిర్యాల కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపు
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: జనరల్ స్థానాలు అంటే అగ్రవర్ణాలవి కావు, అవి బీసీలవే అని బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు. గురువారం మంచిర్యాలలోని బీసీ సమాజ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో జరగబోయే మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీ ఓటర్లు ఓటు చైతన్యంతో వ్యవహరించి తమ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. 50 నుంచి 60 శాతం వరకు ఉన్న బీసీ ఓట్లే ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా మారుతాయని, మన ఓటు మనకే వేసుకొని జనరల్ స్థానాలను కైవసం చేసుకోవాలని ఆయన సూచించారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 30 డివిజన్లలో జనరల్ స్థానాలైనప్పటికీ బీసీ అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు శ్రీనివాస్ తెలిపారు. అక్కడ బీసీలే గెలుపోటములను శాసించే స్థితిలో ఉన్నారని, అందుకే విజయం సునాయసమని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో మెజారిటీ సంఖ్యలో బీసీలు విజయం సాధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో పట్టణ ప్రాంత ఎన్నికల్లోనూ బీసీలంతా ఐక్యతను చాటి అత్యధిక స్థానాలు దక్కించుకోవాలని కోరారు. మంచిర్యాల తొలి కార్పొరేషన్ పాలకవర్గంలో మెజారిటీ సభ్యులు బీసీ వర్గాల వారే ఉండాలని, తద్వారా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని శ్రీనివాస్ ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఏ ఎన్నికలు జరిగినా బీసీలంతా ఒక్కతాటిపైకి వచ్చి రాజ్యాధికారం సాధించే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ జిల్లా ఉపాధ్యక్షుడు బొలిశెట్టి లక్ష్మణ్, జిల్లా నాయకుడు పొట్టాల మల్లేష్, మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుతోట పద్మా దేవి, నాయకులు చెవుల సురేష్, బండారు రాందాస్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.







