అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు.. మౌలిక వసతుల కల్పనకు హామీ
భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారంలో ఓటర్లకు విన్నపం
నస్పూర్, ఆర్.కె న్యూస్: 32వ డివిజన్ కార్పొరేటర్గా ఆదరించి గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో కార్పొరేషన్లోనే ప్రథమ స్థానంలో నిలుపుతానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్ని మధుకర్ ప్రకటించారు. శనివారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకుంటూ చేయి గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మాజీ డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆశీస్సులతో తాను ఈ ఎన్నికల బరిలో నిలిచినట్లు వెల్లడించారు.

గత శాసనసభ ఎన్నికల సమయంలో ఏరియా ఇన్చార్జిగా వ్యవహరించిన తనకు స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన ఉందని మధుకర్ పేర్కొన్నారు. ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇప్పటికే మెజారిటీ సమస్యలను పరిష్కరించినట్లు వివరించారు. డి ఎం ఎఫ్ టి నిధులను వినియోగించి డివిజన్ వ్యాప్తంగా సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ప్రజల సౌకర్యార్థం మూడు కమ్యూనిటీ హాళ్లను నిర్మించినట్లు చెప్పారు. నివాస గృహాల పైనుంచి వెళ్తున్న 11 కెవి విద్యుత్ లైన్లను తొలగించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించినట్లు వివరించారు.
సంక్షేమ పథకాల అమలులో డివిజన్కు ప్రాధాన్యత ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటికే 39 మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. మిగిలిన అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందేలా ప్రత్యేక కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలో సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు, కొత్తగా పెళ్లైన వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయించామని గుర్తు చేశారు. ఆదిపరాశక్తి దేవాలయం వద్ద 50 లక్షల రూపాయల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరై టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిందని వెల్లడించారు.
రాబోయే రోజుల్లో డివిజన్ రూపురేఖలు మారుస్తామని మధుకర్ ధీమా వ్యక్తం చేశారు. ఇరుకైన రోడ్లలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మించి రహదారులను వెడల్పు చేస్తామన్నారు. స్థానికుల ఆరోగ్యం కోసం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. డ్వాక్రా భవనానికి మరమ్మత్తులు చేపట్టి అవసరమైన సౌకర్యాలు కల్పించి మహిళలకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







