- 33వ డివిజన్లో అభ్యర్థి ఎంబడి కుమారస్వామి తరఫున ముమ్మర ప్రచారం
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల కార్పొరేషన్ లోని మొత్తం 60 స్థానాలను భారీ మెజారిటీతో గెలిచి కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని జిల్లా మాజీ డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. ఆదివారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 33వ డివిజన్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంబడి కుమారస్వామిని చేయి గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని స్థానిక ప్రజలను కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని గుర్తు చేశారు. స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నేతృత్వంలోనే మంచిర్యాల కార్పొరేషన్ అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నస్పూర్ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని కొక్కిరాల సురేఖ ఆరోపించారు. గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. మంచిర్యాల పట్టణంతో సమానంగా నస్పూర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని వివరించారు. ప్రజా మద్దతుతో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎంబడి కుమారస్వామి గెలుపుతోనే డివిజన్ సమస్యలు పరిష్కారం అవుతాయని ఓటర్లకు వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.







